AP | ఆరోగ్య ఆనంద స్వ‌ర్ణాంధ్రకు యోగాంధ్ర : కె.విజ‌యానంద్‌

(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : ఆరోగ్య ఆనంద స్వ‌ర్ణాంధ్ర సాకారానికి రాష్ట్ర ప్ర‌భుత్వం ముఖ్య‌మంత్రి ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా మే 21న ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన యోగాంధ్ర కార్య‌క్ర‌మం ముందుకెళ్తోంద‌ని, ఇదే స్ఫూర్తితో కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసేందుకు స‌మ‌ష్టిగా అడుగులేద్దామ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె.విజ‌యానంద్ పిలుపునిచ్చారు. ఆయుష్‌శాఖ‌, ఎన్‌టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా పోలీస్ క‌మిష‌న‌రేట్‌, విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ సంయుక్త ఆధ్వ‌ర్యంలో గురువారం విజ‌య‌వాడ బీఆర్‌టీఎస్ యోగా స్ట్రీట్‌లో నిర్వ‌హించిన పోలీసు థీమ్ యోగా కార్య‌క్ర‌మంలో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె.విజ‌యానంద్ పాల్గొని సీనియ‌ర్ ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల‌తో క‌లిసి యోగాస‌నాలు అభ్య‌సించారు.

అనంత‌రం సీఎస్ మాట్లాడుతూ… ఆరోగ్య‌వంత‌మైన, సంతోష‌క‌ర‌మైన స‌మాజ నిర్మాణం ల‌క్ష్యంగా అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం జూన్ 21 వ‌ర‌కు రాష్ట్రంలోని ప్ర‌తి గ్రామం, ప‌ట్ట‌ణంలో యోగాంధ్ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతాయ‌ని, అప్ప‌టికి క‌నీసం రెండుకోట్ల మందికి యోగాను నేర్పించేలా ప్ర‌ణాళిక ప్ర‌కారం కృషి చేస్తున్న‌ట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,25,000 మంది యోగా ట్రైన‌ర్లు న‌మోదు చేసుకున్నార‌ని, వీరి స‌హాయంతో ప్ర‌జ‌ల‌కు యోగాపై అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతో పాటు యోగాస‌నాలు నేర్చుకునేలా ప్రోత్స‌హిస్తున్నామ‌న్నారు. 26 జిల్లాల్లో 26 థీమ్‌ల‌తో యోగాంధ్ర ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నామ‌ని.. రైతులు, కార్మికులు, ఉపాధి హామీ శ్రామికులు, సీనియ‌ర్ సిటిజ‌న్స్‌, విభిన్న ప్ర‌తిభావంతులు.. ఇలా స‌మాజంలోని ప్ర‌తివ‌ర్గానికి యోగాను చేరువ‌చేసేందుకే ఈ థీమ్ యోగాను నిర్వ‌హిస్తున్న‌ట్లు వివ‌రించారు.

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100 ప‌ర్యాట‌క ప్రాంతాల్లోనూ యోగా విశిష్ట‌త‌ను వివ‌రించి, అవ‌గాహ‌న క‌ల్పించే కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. ఇందుకు ప్ర‌తిజిల్లాలో నాలుగైదు చొప్పున ప‌ర్యాట‌క ప్రాంతాల‌ను గుర్తించిన‌ట్లు తెలిపారు. థీమ్ యోగాంధ్ర‌లో భాగంగా గురువారం విజ‌య‌వాడ బీఆర్‌టీఎస్ యోగా స్ట్రీట్‌లో నిర్వ‌హించిన పోలీస్ థీమ్ యోగా కార్య‌క్ర‌మం విజ‌య‌వంత‌మైంద‌ని.. ఇదే స్ఫూర్తితో యోగాంధ్ర విజ‌య‌వంతానికి కృషిచేద్దామ‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌యానంద్ అన్నారు.

యోగాంధ్ర‌కు విశేష స్పంద‌న‌…
యోగాంధ్ర‌కు విశేష స్పంద‌న ల‌భిస్తోంద‌ని.. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు కార్య‌క్ర‌మంలో భాగస్వాముల‌వుతూ యోగా ఔన్న‌త్యానికి వ‌న్నె తెస్తున్నార‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి (వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం) ఎం.టి.కృష్ణ‌బాబు అన్నారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ యోగాభిలాషులు న‌మోదు చేసుకుంటున్నార‌ని, కొన్ని జిల్లాల్లో ల‌క్ష్యానికి మించి ఔత్సాహికులు రిజిస్ట్రేష‌న్ చేయించుకున్న‌ట్లు వివ‌రించారు.

క‌నుల‌విందుగా క‌ళాత్మ‌క యోగా…
కార్య‌క్ర‌మంలో భాగంగా చిన్నారుల ఆర్టిస్టిక్ యోగా ప్ర‌ద‌ర్శ‌న‌లు ఆక‌ట్టుకున్నాయి. శ్వాసపై ఏకాగ్రత అనేది సర్వరోగ నివారిణిగా పనిచేస్తుందంటూ యోగా, ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలను వివ‌రిస్తూ ఓం శాంతి బ్ర‌హ్మ‌కుమారీలు యోగా ఔత్సాహికుల‌తో ధ్యాన సాధ‌న చేయించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం క‌మిష‌న‌ర్ జి.వీర‌పాండ్య‌న్‌, ఆయుష్ డైరెక్ట‌ర్ కె.దినేష్ కుమార్‌, విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ధ్యానచంద్ర హెచ్ఎం, ఇన్‌స్పెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ పోలీస్ బి.రాజ‌కుమారి, ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ, ఏపీఎస్‌పీ ఐజీ ర‌త్న‌కుమారి, డీసీపీ కేజీవీ స‌రిత, విజ‌య‌వాడ ఆర్‌డీవో కావూరి చైత‌న్య‌, జిల్లా ఆయుష్ యోగాంధ్ర నోడ‌ల్ అధికారి డా. వి.రాణి, ఆయుష్ అధికారి డా. రామ‌త్లేహి, మెడిక‌ల్ ఆఫీస‌ర్ డా. వై.ర‌త్న ప్రియ‌ద‌ర్శిని, అమ‌రావ‌తి యోగా, ప‌తంజ‌లి యోగా, ఈషా ఫౌండేష‌న్‌, ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఓం శాంతి బ్ర‌హ్మ‌కుమారీలు, పెద్దఎత్తున యోగా ఔత్సాహికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *