మహాభారతంలో స్త్రీపర్వం భర్తలను, సోదరులను, కొడుకులను పోగొట్టుకున్న అబలల మనోవ్యధకు దర్పణం పడుతుంది. ఆత్మీయులు చనిపోయినప్పుడు మనిషి మనసులో చెలరేగే భావోద్వేగాలను, వాటి పరిణామాలను వివరిస్తుంది. రాజ్యాలు ఏలినవారైనా, ఉన్నత పదవులు అధిరోహించిన వారైనా అస్థిరమైన సుఖాల కోసం అధర్మపరులైతే, క్రూరకర్మలతో చేతులు కలిపితే వినాశం తప్పదని హెచ్చరిస్తుంది. స్త్రీలను పరాభవించినవారికి పట్టే దుర్గతిని చూపుతుంది.
మహాభారత యుద్ధం ముగిసింది. గాంధారితోపాటు భరతవంశపు స్త్రీలు యుద్ధభూమికి చేరుకున్నారు. వ్యాస మహర్షి వరం వల్ల గాంధారికి దూరం నుంచే కౌరవులు చనిపోయిన యుద్ధభూమి కనపడసాగింది. పదమూడేండ్ల పాటు భూమిని నిరాటంకంగా పాలించిన దుర్యోధనుడు ధూళిలో పడిఉన్న దృశ్యం చూస్తూ గాంధారి వ్యాకులపాటుకు గురయింది. మరోపక్క అహంకారంతో ద్రౌపదిని పరాభవించిన దుశ్శాసనుడు చేతులు చాపుకొని శాశ్వత నిద్రలో ఉన్నాడు. ప్రాణాలు పోగొట్టుకుని చిందరవందరగా పడి ఉన్న కొడుకులను, బంధువులను చూస్తూ గాంధారి విలపించసాగింది. దు:ఖం అధికం కావడంతో విచక్షణాశక్తిని కోల్పోయిన గాంధారి ఇంతటి మారణహోమానికి శ్రీకృష్ణుడే కారణమని నిందిస్తూ శపించింది.
గాంధారి అపరాధం వల్లనే కౌరవ సంహారం జరిగిందని శ్రీకృష్ణుడు వివరించాడు. గాంధారి దుష్టుడైన పుత్రుణ్ని సజ్జనుడని భ్రమించింది. వ్యర్థంగా కలహాలు పెట్టుకుని పెద్దలు, వృద్ధుల ఆజ్ఞలను ఉల్లంఘించిన దుర్యోధనుణ్ణి పుత్ర వ్యామోహంతో అదుపులో పెట్టలేకపోయింది. చేసిన అపరాధానికి ఆమె మూల్యం చెల్లించిందని శ్రీకృష్ణుడు విశదీకరించాడు. నూరుగురు కొడుకులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడి మనసు పుత్రశోకంతో మండిపోయింది. ఆ సమయంలో సంజయుడు ధృతరాష్ట్రుణ్ణి ఓదార్చాడు. తానే అగ్నిని ముట్టించి కొంగున కట్టుకుని మంటపెట్టుకుని ఆపై తీరిగ్గా పశ్చాత్తాప పడటం వల్ల ప్రయోజనం ఉండదు. కౌరవులు పాండవులనే అగ్నిని మాటలనే గాలితో మండించి, ఆ మంటపై లోభమనే నేతిని పోసి ప్రజ్వలింపజేశారు. అగ్నికీలలు పైకి లేవగానే శలభాల్లా ఆ మంటలో పడి బూడిదైపోయారు. అటువంటివారి కోసం శోకించాల్సిన పనిలేదంటూ సంజయుడు ధృతరాష్ట్రుడికి నచ్చజెప్పాడు.
జ్ఞానుల సలహాలను పెడచెవిన పెట్టి, దుష్టబుద్ధి కలవారి మాటలకు విలువనిస్తూ అధర్మపరులైన అహంకారులకు చివరికి పతనం తప్పదని స్త్రీపర్వం వివరిస్తుంది. తమ సంతానం అధర్మమార్గంలో అకృత్యాలు చేస్తున్నా పుత్రవ్యామోహంతో సమర్థించేవారు వృద్ధాప్యంలో ధృతరాష్ట్రుడు, గాంధారిలా దు:ఖించక తప్పదని స్త్రీపర్వం బోధిస్తుంది. సహృదయులకు శత్రువు కాకూడదని, క్రోధలోభాలను విడిచిపెట్టాలన్న జీవితసత్యాలను ఉద్బోధిస్తుంది.
- కామిడి సతీష్ రెడ్డి