స్లాట్ బుకింగ్తో తెల్లబంగారం విక్రయం
మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్ నియోజకవర్గంలో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
హుస్నాబాద్, అక్టోబర్ 22(ఆంధ్రప్రభ) : కపాస్ కిసాన్ మొబైల్ యాప్లో స్లాట్ బుక్ చేసుకుని రాజమార్గంలో తెల్లబంగారాన్ని(పత్తి)ని విక్రయించుకోవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గం చిగురుమామిడి మండలం కొండాపూర్ సమీపంలోని గోమాత పత్తి మిల్లులో బుధవారం పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. పత్తి తేమ శాతాన్ని పరిశీలించి మాట్లాడారు. కాటన్ కార్పొరేషన్ 12 రాష్ట్రాల్లో కపాస్ కిసాన్ మొబైల్ యాప్ కింద ఆన్లైన్ ద్వారా ఏ జిన్నింగ్ మిల్లు ఉంటే అక్కడ పత్తి కొనుగోలు కేంద్రాన్ని సూచిస్తుందని తెలిపారు.

వారు మనకు తేదీ స్లాట్ ఇస్తే పంటను అమ్ముకోవచ్చని తెలిపారు. మొక్కజొన్న కూడా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.. ఈరోజు హుస్నాబాద్ (Husnabad) లో మొక్కజొన్న కేంద్రాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సంబంధించి ఏ ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమవతి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.