దేశంలోని పలు రాష్ట్రాలలో విస్తారంగా వానలు
ఎపికి వాయుగండం..
ఉత్తర, దక్షిణ కోస్తా అంధ్రాలో కుంభవృష్టి
తెలంగాగాణలో చెదురు ముదురుగా వానలు
కృష్ణమ్మకు జల కళ…నిండుతున్న రిజర్వాయర్లు
అతి వేగంగా విస్తరిస్తున్న నైరుతీ రుతుపవనాలు
న్యూ ఢిల్లీ – నైరుతీ రుతుపవనాలు బలంగా ముందుకు సాగుతున్న కొద్దీ వాయువ్య భారతదేశంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దేశవ్యాప్తంగానూ ఉరుములు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా కేరళలో భారీ వర్షపాతం పడే అవకాశం ఉందని, రాష్ట్రంలోని అనేక జిల్లాలకు హెచ్చరికలు కూడా వాతావరణశాఖ జారీ చేసింది. కేరళలోని ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
కేరళలో హెవీ రెయిన్స్ .
కేరళలోని పతనంతిట్ట, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, కోజికోడ్ సహా ఎనిమిది జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తిరువనంతపురం, కొల్లం, అలప్పుజ, త్రిసూర్ సహా ఆరు జిల్లాలకు సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కొనసాగుతున్న భారీ వర్షాల దృష్ట్యా, కేరళ అంతటా జిల్లా యంత్రాంగాలు ఇవాళ అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాయి. ఇడుక్కిలో, హై-రేంజ్ ప్రాంతాలలో రాత్రి ప్రయాణాన్ని సాయంత్రం 7 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు నిషేధించారు.
దేశ వ్యాప్తంగా వానలే వానలు ..
దేశంలోని చాలా ప్రాంతాలలో వార్షిక నైరుతి రుతుపవనాలు బలంగా ముందుకు సాగుతున్నందున రాబోయే నాలుగు నుండి ఐదు రోజుల్లో వాయువ్య భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ఈదురుగాలులతో కూడిన విస్తృతమైన ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం పశ్చిమ రాజస్థాన్, మధ్య ఉత్తరప్రదేశ్లోని ఉత్తర ప్రాంతాలలో ఎగువ వాయు తుఫాను కారణంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.
జమ్మూ, హిమచల్ ప్రదేశ్, ఢిల్లీలోనూ కుండపోతే
జమ్మూ-కాశ్మీర్-లడఖ్-గిల్గిట్-బాల్టిస్తాన్-ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా , ఢిల్లీలలో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. జూన్ 2 వరకు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లలో కొన్నిచోట్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ నెల 30, 31 తేదీల్లో జమ్మూ-కాశ్మీర్-లడఖ్-గిల్గిట్-బాల్టిస్తాన్-ముజఫరాబాద్లలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది.
ఎపికి వాయిగండం ..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం మారింది.. దీని ప్రభావంతో ఎపిలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. అలాగే దక్షిణ కోస్తాలో కొన్నిచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. సముద్ర తీరం వెంట కోస్తా జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని న వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పారాదీప్నకు తూర్పు ఈశాన్యంగా 190 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతం అయి ఉందని వాతావరణశాఖ పేర్కొంది.
కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, తిరుపతి జిల్లాల్లో నేడు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
ఇక గురువారం నాడు పల్నాడు జిల్లా రెంటపాళ్ళలో 47.5మిమీ, గరికపాడులో 41, సత్తెనపల్లిలో 34.5మిమీ వర్షపాతం నమోదైంది.
కృష్ణమ్మకు వరద పోటు
ఇది ఇలా ఉంటే ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు కృష్ణ నదికి వేగంగా నీరు చేరుతున్నది.. జురాల ప్రాజెక్ట్ లోని 12 గేట్లు ఎత్తివేయడంతో శ్రీశైలంకు వేగంగా వరద నీరు చేరుకుంటున్నది.. అలాగే తుంగ , భద్ర నదులలో కూడా వరద నీరు ప్రవహిస్తున్నది.. దీంతో ప్రాజెక్టు జలకళను సంతరించుకుంటున్నాయి
తెలంగాణలో …
తెలంగాణలో నైరుతి రుతుపవనాలు పూర్తి స్థాయిలో విస్తరించాయి.. ఛత్తీస్గఢ్, ఒడిస్సాలోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు వ్యాపించాయి. ఈ రోజు తెలంగాణలోని అన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతోపాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఈ రోజు గరిష్టంగా నల్లగొండ లలో 37, కనిష్టంగా మహబూబ్ నగర్ లో 29.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.. రాగల మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఐదు నుండి ఏడు డిగ్రీలు తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంది.