హైదరాబాద్, (ఆంధ్రప్రభ) : దశాబ్దాలుగా ఎందరో … కవులు, కళాకారులు, గాయకులు.. ఆధ్యాత్మికవేత్తలు, నాట్యకారిణులు … విద్యావేత్తలు, నాటక ప్రయోక్తలు… ఐఏఎస్ లు, ఐపీఎస్ లు … మంత్రులు .. ఏక మొత్తంగా మేధో సమాజం సంచరించి కళల కార్యకలాపాలతో పునీతమైన నేల హైదరాబాద్ లోని త్యాగరాయ గానసభ ప్రాంగణంలో ఈ శుక్రవారం ఉదయం వేదవేత్తలు మంత్రాలు పరమాద్భుతంగా పఠిస్తుండగా… ఎదురుగా మహా గణపతి హోమం జరుగుతుండగా ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ చే అతి అరుదైన కృష్ణ శిలా శోభితమైన అభయ గణపతి కి ప్రాణ ప్రతిష్టాది అపూర్వ శ్రీ కార్యాలు జరగడంతో ఆ ప్రాంతం పరమ పవిత్రతను సంతరించుకుందని త్యాగరాయ గానసభ పాలకవర్గం సంతోషాన్ని వెలిబుచ్చడం విశేషం.
కృష్ణ శిలతో ప్రకాశిస్తున్న అభయగణపతికి పురాణపండ శ్రీనివాస్ పరిమళ భరిత పుష్పాలతో అభిషేకార్చనలు చేయగా…. త్యాగరాయ గానసభ అధ్యక్షులు కళా జనార్ధనమూర్తి స్వయంగా హోమాది క్రతువుల్లో పాల్గొని ఆద్యంతం సుమారు నాలుగు గంటలసేపు ఈ అపూర్వాన్ని నడిపించారు. శృంగేరి శంకరమఠంకి చెందిన స్మార్త భట్టారకులు నిమ్మకంటి శ్రీనివాస శర్మ సుమారు మూడు గంటలపాటు ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని వేదేవిహితంగా నడిపించి భక్తుల్ని ఆకట్టుకోవడం గమనార్హం.
హాస్యబ్రహ్మ శంకర నారాయణ తదితర ప్రముఖులు పాల్గొన్న ఈ మంగళకార్యంలో పురాణపండ శ్రీనివాస్ పూనుకున్న అఖండ మహాసంకల్పాన్ని ప్రశంసించడం ఆసక్తికరం. ఒక పుస్తకాన్ని ముద్రించడం, అమ్మడం ఎంతో కష్టకాలమవుతున్న ఈ కాలంలో … అలవోకగా వేలమందిని ఎంతో ఆకట్టుకునే శైలితో చక్కని మంత్రమయ గ్రంధాలు రచనలుగా, సంకలనాలుగా నాణ్యతా ప్రమాణాల ముద్రణతో అందిస్తూ… నిస్వార్ధ యజ్ఞమయ సేవతో తరిస్తున్న పురాణపండ శ్రీనివాస్ వెన్ను తట్టడం వల్లనే ఈ అభయగణపతిని శృంగేరి శారదాంబ అనుగ్రహంతో అందించగలిగినట్లు త్యాగరాయ గానసభ అధ్యక్షులు జనార్ధనమూర్తి వివరంగా పేర్కొన్నారు. తెలంగాణలో వేల ఆలయాల్లో పురాణపండ శ్రీనివాస్ ఆర్ష భారతీయ గ్రంధాలు అర్చక ప్రముఖుల చేతుల్లో నిత్యం కొలువుదీరడం వెనుక ఎంతో దైవ శక్తీ ఉందనేది మన కన్నుల ముందు కనిపిస్తున్న సత్యంగా ఈ విశేష కార్యక్రమానికి హాజరైన పలువురు ప్రశంసలు వర్షించారు.