కడెం, ఏప్రిల్ 9 (ఆంధ్రప్రభ) : కడెం మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ చౌరస్తా వద్ద ప్రధాన రహదారిపై సదర్ మట్ ఆయకట్టు రైతులు బుధవారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కడెం మండలంలోని లింగాపూర్, మాసాయిపేట్, ఎలగడప, నచ్చన్ ఎల్లాపూర్, సారంగాపూర్, మల్లన్నపేట్, పాత మద్దిపడగ, కొత్త మద్దిపడగ, పెద్దూర్ తాండ, వకీల్ నగర్, చిట్యాల్ గ్రామాల రైతుల పంటలు చివరి దశకు వచ్చాయని సదర్ మాట్ కాలువకు సాగునీటి విడుదల నిలిపివేయవద్దని పంటలు ఎండిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
సదర్ మట్ కాలువకు నీరు తక్కువగా వస్తున్నాయని, నేటితో నీటి విడుదల నిలిపివేస్తారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న కడెం మండల తహసీల్దార్ రొడ్డ ప్రభాకర్, ఎస్ఐ కృష్ణ సాగర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడినా ఫలితం లేకపోగా, కడెం మండల తహసీల్దార్ రొడ్డ ప్రభాకర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కు ఫోన్ చేసి రైతులతో మాట్లాడించగా, ఈనెల చివరి వరకు సాగునీటిని విడుదల చేస్తామని, అవసరముంటే మరో రెండు తడులకు అదనంగా నీటి విడుదలకు కృషి చేస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హామీ మేరకు రైతులు ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో పై గ్రామాల సదర్ మట్ ఆయకట్టు రైతులు, నాయకులు పాల్గొన్నారు.