విశాఖపట్నం – ఐపీఎల్ సీజన్ షురూ అయిన నేపథ్యంలో బెట్టింగ్ ముఠాల కార్యకలాపాలు పెరుగుతున్నాయి. వీరి ఉచ్చులో చిక్కుకొని ఎంతో మంది పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి,ఆత్మహత్యలకు పాల్పడుతున్న బాధితులెందరో. బెట్టింగ్ల కోసం బ్యాంకుల్లో బంగారాన్ని సైతం కుదువపెట్టేవారు కొందరైతే, లోన్ యాప్లు, ప్రైవేట్ ఫైనాన్షియర్ల వద్ద వడ్డీలకు కాసే వారు మరికొందరు. ఈజీ మనీకోసం అత్యాశతో బెట్టింగ్ ముఠా వలలో ప్రధానంగా యువత, ఆటోడ్రైవర్లు, భవన కార్మికులు, ప్రైవేటు ఉద్యోగులు, చిన్నచిన్న వ్యాపారులు చిక్కుకుంటున్నారు.
బెట్టింగ్లో రూ.178 కోట్ల లావాదేవీలు:
బెట్టింగ్లో లక్కు ఎవరికో ఒకరికే అన్న సంగతి తెలిసే బెట్టింగులకు పాల్పడుతున్నారు. ఇందులో ఓడిపోవడంతో అప్పులు తీర్చలేక ఏకంగా ప్రాణాలు తీసుకుంటున్న ఉదంతాలు నిత్యకృత్యం అయ్యాయి. ఏపీలో ఎక్కువగా విశాఖలో ఈ బెట్టింగ్ ముఠాలకు సంబంధించి కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఈ తరుణంలో ఈ ఏడాది జనవరిలో బెట్టింగ్ గ్యాంగుల స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. పెదవాల్తేరులోని అపార్ట్మెం ట్లో ఒక బుకీ పట్టుబడగా పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి దాదాపు 80 బ్యాంకు ఖాతాల్లోని రూ.45 లక్షలను సీజ్ చేశారు. నిందితులు బెట్టింగ్లను నిర్వహించి రూ.178 కోట్ల మేర లావాదేవీలు జరిపినట్లు విచారణలో తేలింది. ఈ ఘటనలో ప్రధాన నిందితులతో సహా ఒక్కొక్కరిని అరెస్టు చేసే పనిలో పోలీసులు ఉన్నారు. ప్రస్తుతానికి అరెస్టు అయిన నిందితుల సంఖ్య 13కి చేరింది.
అరెస్టు అయిన వారిలో ప్రధాన నిందితులు ఎక్కువగా రాజకీయ నేపథ్యం ఉంటోంది. దీంతో వారు ప్రస్తుతం బెయిల్పై బయటే ఉండటం గమనార్హం. అంతే కాకుండా మొన్నటి వరకు వైఎస్సార్సీపీలో ఉండి, ఇటీవల కూటమి నేతల చెంత చేరారు. వీరి వద్ద ఉన్న పాత కాంటాక్టులతో పక్కా ప్రణాళిక వేసుకుని ఐపీఎల్ బెట్టింగ్లకు దిగుతున్నట్లు సమాచారం. డిజిటల్ లావాదేవీలు కాకుండా నగదు డిపాజిట్లు చేయించుకుని ఒక ఫోన్ నంబరు ఇస్తారు. ఆ నంబర్కు ఫోన్ చేస్తే పాతవారైతేనే బెట్టింగ్ కలుపుతారు. బుకీలకు తెలియని లేదా కొత్త నెంబర్లు నుంచి ఫోన్లు వస్తే ఆ నెంబర్లను స్విచాఫ్ చేస్తారు.
ఫిర్యాదు చేయండి… చర్యలు తీసుకుంటాం ..
నగర శివారులోని పలు కాలనీల్లో అపార్ట్మెంట్లు అద్దెకు తీసుకుని నిందితులు బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. బుకీల కదలికలు, బెట్టింగ్లపై పక్కా సమాచారం ఉన్నా కొందరు పోలీసు సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం లేదని సమాచారం. ఇటీవల పట్టుబడిన ముఠాతో సంబంధాలు ఉన్నాయని రుజువు కావడంతో స్పెషల్ బ్రాంచి కానిస్టేబుల్పై సస్పెండ్ వేటు వేశారు. ఇలా కొందరు దాడులకు వస్తే సమాచారం ఇస్తాం అని బెట్టింగ్ ముఠాలతో జత కట్టినట్లు తెలుస్తోంది. ఆన్లైన్, ఆఫ్లైన్ బెట్టింగ్ల వల్ల మోసపోయినవారు ఫిర్యాదు చేస్తే నిందితులను అరెస్టు చేస్తామని సీపీ శంఖబ్రత బాగ్చీ తెలిపారు.