శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : భారత స్వాతంత్ర్య సమర నినాదం, జాతిని ఏకతాటిపై నిలిపిన ‘వందేమాతరం’ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన శుభ సందర్భంగా, కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు భారత వికాస్ పరిషత్, శ్రీకాకుళం శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం సరిగ్గా 10 గంటలకు అత్యంత భక్తి శ్రద్ధలతో సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ దేశభక్తి వేడుకకు నగరంలోని సీనియర్ సిటిజన్లు, మాజీ సైనికులు, మేధావులు పెద్ద సంఖ్యలో హాజరై జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో వక్తలు మాట్లాడుతూ, బకించంద్ర ఛటర్జీ రాసిన వందేమాతరం గీతం భారతీయతకు, జాతీయ భావానికి నిలువెత్తు నిదర్శనమని ఉద్ఘాటించారు. దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో ఈ గీతం పోషించిన పాత్ర కీలకమన్నారు. కార్యక్రమంలో బుర్రా ఆదినారాయణ శాస్త్రి, పి. సూర్య ప్రకాష్ రావు, ఎస్. వైకుంఠ రావు, డీజీ పట్నాయక్, పి.రమణ మూర్తి, పీవీ. కృష్ణారావు, జీఎస్ఆర్. గుప్తా, డా. రవి కుమార్ తదితరులు పాల్గొని వందేమాతరం స్ఫూర్తిని చాటారు.

