Union Minister | థ్యాంక్యూ వెరీ మచ్ సార్

Union Minister | థ్యాంక్యూ వెరీ మచ్ సార్
- ₹75.00 కోట్లు శాంక్షన్ చేశారు
- గుంటూరు కాకినాడల్లో
- జాతీయ క్రీడా కేంద్రాలు కావాలి
- అదనపు ఖేలో ఇండియా ప్లీజ్
- రాయచోటిలో ఫుట్బాల్ గ్రౌండ్
- కేంద్ర క్రీడల మంత్రికి ఏపీ మంత్రి మండిపల్లి వినతి
Union Minister | ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ₹75.00 కోట్ల క్రీడా నిధులను మంజూరు చేసినందుకు కేంద్ర మంత్రికి ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ క్రీడాభివృద్ధికి కేంద్ర సహకారం కోరారు. గుంటూరు, కాకినాడలో జాతీయ ఉత్తమ క్రీడాకేంద్రాల మంజూరు చేయాలని అభ్యర్థించారు.

ప్రతి జిల్లాకు అదనపు ఖేలో ఇండియా కేంద్రాలు మంజూరు చేయాలని, ఖేలో ఇండియా పథకంలో ₹.675 కోట్ల క్రీడా మౌలిక సదుపాయాల కల్పించాలని మంత్రి మండిపల్లి ప్రతిపాదనలు చేశారు.
కేంద్రం, రాష్ట్ర సమన్వయంతో క్రీడల అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
న్యూఢిల్లీలో శనివారం కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ₹ 75.00 కోట్ల క్రీడా నిధులను మంజూరు చేసినందుకు కేంద్ర మంత్రికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులు రాష్ట్రంలోని క్రీడా వ్యవస్థను సమగ్రంగా అభివృద్ధి చేసే దిశగా కీలకంగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
రాయచోటిలో ఫుట్బాల్ మైదానం ప్లీజ్
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పూర్తిస్థాయి, అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఫుట్బాల్ మైదానం లేకపోవడంపై కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో, అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో ఫుట్బాల్ మైదానం, ఫ్లడ్ లైట్స్, గ్యాలరీతో కూడిన అత్యాధునిక ఫుట్బాల్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి కేంద్ర సహకారం అందించాలని మంత్రి కోరారు.

ఈ ఫుట్బాల్ మైదానం నిర్మాణం ద్వారా రాయచోటిలో జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీల నిర్వహణకు అవకాశం కలుగుతుందని, ఇందుకోసం 24.90 ఎకరాల విస్తీర్ణంలో తగిన భూమి ఇప్పటికే అందుబాటులో ఉందని మంత్రి తెలిపారు. ఈ మౌలిక సదుపాయాలు రాష్ట్రంలో ఫుట్బాల్ క్రీడకు వ్యూహాత్మకమైన అభివృద్ధికి, యువ క్రీడాకారుల ప్రతిభ వెలికితీయడానికి దోహదపడతుందని స్పష్టం చేశారు.
ప్రతి జిల్లాకు ఖేలో ఇండియా ప్లీజ్
రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, క్రీడా మౌలిక సదుపాయాల విస్తరణకు సంబంధించి పలు కీలక అంశాలను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అథ్లెటిక్స్, ఆర్చరీ, వెయిట్లిఫ్టింగ్ విభాగాలకు జాతీయ ఉత్తమ కేంద్రం (NCoE) మంజూరు చేయాలని.
కాకినాడ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ పరిధిలో హాకీ, షూటింగ్ విభాగాలకు జాతీయ ఉత్తమ కేంద్రం (NCoE) ఏర్పాటు చేయాలని. ఖేలో ఇండియా పథకం కింద ఇప్పటికే రాష్ట్రంలో విజయవంతంగా పనిచేస్తున్న 26 కేంద్రాలతో పాటు, ప్రతి జిల్లాకు ఒక అదనపు జిల్లా స్థాయి ఖేలో ఇండియా కేంద్రం (DLKIC) మంజూరు చేయాలని. ఖేలో ఇండియా మార్గదర్శకాలకు అనుగుణంగా, రూ. 675.36 కోట్ల అంచనా వ్యయంతో 56 క్రీడా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మంజూరు చేయాలని కోరారు.

అన్నమయ్య జిల్లా, రాయచోటి మండలం నక్కవండ్లపల్లి, దిగువ అబ్బవరం గ్రామంలో రూ. 42.62 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర విభజన అనంతరం క్రీడా మౌలిక సదుపాయాల కొరత ఉన్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమగ్ర క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర సహకారం అందించాలని కోరారు.
కేంద్ర మంత్రి సానుకూలం
మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో యువత సంఖ్య అధికంగా ఉండటంతో క్రీడల ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం, క్రీడా ప్రతిభ, జాతీయ స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంగా పనిచేస్తూ క్రీడల అభివృద్ధికి పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
మంత్రి మండిపల్లి అభ్యర్ధనలపై కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని, క్రీడల అభివృద్ధికి కేంద్రం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి శ్రీమతి రక్షా నిఖిల్ ఖడ్సే, ఎంపీ హరీష్ బాలయోగి ఉన్నారు.
