ఉట్నూర్, జూన్ 16 (ఆంధ్రప్రభ) : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని బీర్సాయిపేట్ (Birsaipet) గండి అటవి ప్రాంతంలో ఇవాళ ఉదయం కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు కారు (car) లోనే అక్కడికక్కడే మృతి చెందినట్లు 108 అంబులెన్స్ ఈఎంటి జాన్, పైలెట్ శంకర్ తెలిపారు.
వారు తెలిపిన వివరాల ప్రకారం… ఆదిలాబాద్ కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారు బెల్లంపల్లి (Bellampally) నుండి కారులో ఆదిలాబాద్ వైపు వస్తుండగా బిర్సాయి పేట్ గండి మూలమలుపు వద్ద కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొంది, ఈ ఘటనలో ఇర్ల షహరిష్ (16), గంట విజయ (50)లు కారులోనే మృతి చెందారని, ఆద్యకు తీవ్రగాయాలై, ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ఉట్నూర్ ఆసుపత్రికి 108లో తరలించి ప్రథమ చికిత్సలు చేసి ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
సుచరిత, రాజు లకు స్వల్ప గాయాలయ్యాయని వారు పేర్కొన్నారు. గాయాలైన వారిని ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క (Athram Suguna), మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు ఆత్రం భుజంగరావు, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర నాయకులు సునీల్ జాదవ్ వెళ్లి పరామర్శించారు. కారు అదుపుతప్పి సంఘటనలో ఇద్దరు మృతి చెందడం బాధాకరమన్నారు.