రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
మక్తల్, ఆంధ్రప్రభ : భీమా ప్రాజెక్టు (Bhima Project) లో అంతర్భాగంగా నిర్మించిన సంగంబండ రిజర్వాయర్కు వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టు అధికారులు శుక్రవారం రోజు రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. గురువారం అర్థరాత్రి నుంచి కురుస్తున్న వర్షాల వల్ల పెద్దవాగుకు పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతుంది. మక్తల్ ప్రాంతం తోపాటు రిజర్వాయర్కు ఎగువ భాగాన కర్ణాటకలోనూ పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తుండడంతో రిజర్వాయర్లోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది.
దీంతో శుక్రవారం వరద రెండు స్పిల్వే గేట్లను ఎత్తి దిగువకు ప్రాజెక్టు అధికారులు నీటిని విడుదల చేశారు. రిజర్వాయర్ (Reservoir) ఎగువ ప్రాంతం కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తుండటంతో పెద్ద వాగుకు వరద పోటెత్తింది. దీంతో రిజర్వాయర్లోకి 1000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండడంతో 1000 క్యూసెక్కుల వరద నీటిని వదిలినట్లు ప్రాజెక్టు డీఈఈ సురేష్, ఏఈ రాహుల్ తెలిపారు. ప్రాజెక్టు సామర్థ్యం 3.317 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 2.63 టీఎంసీల నీరు రిజర్వాయర్లో ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. వరద మరింత పెరిగితే మరిన్నిగేట్లు ఎత్తే అవకాశం ఉందని వారు తెలిపారు.