కాల్పులు, బాంబు మోతలకు గుడ్ బై
అడవి బిడ్డలకు ఆటల్లో ప్రొత్సాహం
దంతేవాడలో సచిన్ టెండూల్కర్ కలల క్షేత్రాలు
క్రికెడ్ గాడ్ నేతృత్వంలో ఛత్తీస్గఢ్లో 50 మైదానాలు
దండకారణ్యంలో ఇకమీదట ఫోర్లు, సిక్సర్ల మోత
క్రికెట్, ఫుట్బాల్, కబడ్డీ, ఖో-ఖో, అథ్లెటిక్స్ వంటి క్రీడలకు పెద్దపీట
సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ : ఛత్తీస్గఢ్లోని (Chattigarh) దంతేవాడ మావోయిస్టుల (Maoists)కంచుకోట. ఈ దండకారణ్యం ఎప్పుడూ తూపాకీ శబ్దాలతో.. బాంబు పేలుళ్లు.. ఆర్త నాదాలతో దద్దరిల్లుతుంది. మావోయిస్టుల అడ్డాగా ఉన్న ఈ అభయారణ్యం ఇప్పుడు శాంతి దిశగా పయనిస్తోంది. దంతేవాడలోని(dantewada) కీలక ప్రాంతాలను భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం… మావోలు లొంగిపోవడం… ఎన్ కౌంటర్లలో మరణించడంతో ఆ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పుడు దంతేవాడలోని యువతను.. పిల్లలను మావోయిజం వైపు మళ్లకుండా ఉండేందుకు కేంద్రం క్రీడలను (sports) అస్త్రంగా చేసుకోనుంది.
క్రికెట్ గాడ్ నేతృత్వంలో …
క్రికెట్ మాస్టర్ సచిన్ ఆధ్వర్యంలో 50 మైదానాలు సిద్ధమవుతున్నాయి. క్రికెట్ గాడ్ నేతృత్వంలో…. నక్సలిజంతో ప్రభావితమైన దంతేవాడ జిల్లా ఇప్పు డు క్రీడల వైపు చూస్తోంది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆధ్వర్యంలో దంతేవాడ జిల్లాలో 50 మైదానాలను నిర్మిస్తున్నారు. ఎప్పుడూ బాంబుల శబ్దాలు, తుపాకీ మోతలు వినిపించే ఈ ప్రాంతంలో పిల్లల నవ్వులు, ఆటలు, వ్యాయామాల మార్పు కనిపించనుంది. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, (Sachin Tendulkar) మాన్ దేశి ఫౌండేషన్తో కలిసి బస్తర్ ప్రాంతంలోని 50 గ్రామాల్లో క్రీడా మైదానాల నిర్మాణా న్ని ప్రారంభించారు.
మార్పుకు ఇదే చిహ్నం..
ఈ మైదానాలు కేవలం ఆటల కోసం మాత్రమే కాదు, గ్రామీణ యువతకు శారీరక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను అందించడమే లక్ష్యంగా పనిచేయనున్నాయి. క్రికెట్, ఫుట్బాల్, కబడ్డీ, ఖో-ఖో, అథ్లెటిక్స్ వంటి క్రీడలకు అవసరమైన మౌలిక సదుపాయాలు గ్రామస్తులే స్వయంగా నిర్మిస్తున్నారు. ఎలాంటి బయట కాంట్రాక్టర్లను పిలవకుండా, గ్రామ ప్రజలే మైదానాలు తయారు చేసుకుంటున్నారు. ప్రతి మైదానం ఒక మార్పుకు చిహ్నం’ అని ఫౌండేషన్ ప్రతినిధి దివ్య సింహా తెలిపారు. ఇవి గిరిజన సమాజాన్ని ప్రేరేపించడమే కాదు, పిల్లలకు కలలు కనే శక్తిని ఇస్తున్నాయన్నారు.