బహిరంగ సభ సక్సెస్ కోసం సన్నాహాలు
పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న నేతలు
కార్యకర్తలను తరలించేందుకు ఏర్పాట్లు
దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందుకు ఖర్గే టూర్
పనిచేసే వాళ్లకే ప్రయారిటి.. లేకుంటే రిటైర్మెంట్ తప్పదు
గుజరాత్లో జరిగిన సమావేశంలో పార్టీ చీఫ్ సీరియస్
ఇక్కడేం అంటారోనని అందరిలోనూ ఉత్కంఠ
డీసీసీల పవర్స్ పెంచే యోచనలో హైకమాండ్
లోకల్, బైపోల్ ఎలక్షన్పై కాంగ్రెస్ ఫోకస్
సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ :
చారిత్రక నేపథ్యం ఉన్న కాంగ్రెస్ (congress ) పార్టీ కీలక సమావేశం హైదరాబాద్లో (hyderabad) రేపు జరగనుంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే (AICC Chief Kharge ) చీఫ్ గెస్ట్గా ఈ సమావేశానికి వస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో (LB stadium ) భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ రెడీ అయ్యింది. గ్రామ, మండల, జిల్లా స్థాయి నేతలంతా ఈ సమావేశానికి రానున్నారు. ఇప్పటికే పీసీసీ నుంచి పార్టీ లీడర్లకు ఆదేశాలు అందాయి. అయితే.. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే రాకతో పార్టీలో కాస్త కాకరేపినట్టు కనిపిస్తోంది. ఇటీవల గుజరాత్లో ఏఐసీసీ ఆధ్వర్యంలో పార్టీ పరంగా భారీ సమావేశం జరిగింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే దేశవ్యాప్తంగా పార్టీ నేతలను ఉద్దేశించి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ కామెంట్స్ చేశారు. పని చేసే వాళ్లు మాత్రమే పార్టీలో ఉండాలని.. పని చేయని వాళ్లు రిటైర్మెంట్ తీసుకోవాలని మొహమాటం లేకుండా చెప్పేశారు. ఇక పార్టీ బలోపేతంలో జిల్లా కాంగ్రెస్ కమిటీలు క్రియాశీలక పాత్ర పోషిస్తాయని, అందుకే డీసీసీ కమిటీల పవర్స్ పెంచే ఆలోచనలో ఉన్నట్లు ఖర్గే చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో జులై 4వ తేదీన హైదరాబాద్లో జరిగే సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని అందరిలోనూ టెన్షన్ నెలకొంది.
పీఏసీ కార్యవర్గ భేటీలో దిశానిర్దేశం..
జులై 4వ తేదీన ఉదయం గాంధీ భవన్లో పీఏసీ (పొలిటికల్ యాక్షన్ కమిటీ) విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. పీఏసీ భేటీ అనంతరం జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమంలో ఖర్గే పాల్గొంటారని పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ వెల్లడించారు. ఇక.. కార్యకర్తల ఓపెన్ మీటింగ్ రేపు సాయంత్రం జరగనుంది. దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న ఖర్గే అందులో భాగంగానే హైదరాబాద్ వస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో కార్యకర్తల సమావేశానికి ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేశారు. గ్రామ, మండల, జిల్లాస్థాయి నేతలు ఇట్లా.. 15 వేల మంది సమావేశానికి హాజరవుతున్నారని పీసీసీ వెల్లడించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఖర్గే ఏం మాట్లాడబోతున్నారనేది ఆ పార్టీలో ఆసక్తిగా మారింది.
ఉప ఎన్నిక, లోకల్ ఎలక్షన్స్పై ఫోకస్..
స్థానిక పంచాయతీ ఎన్నికలు , జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. స్థానిక పంచాయితీ ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో 4వ తేదీన ఏఐసీసీ చీఫ్ ఖర్గే హైదరాబాద్ టూర్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతుందని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారనే దానిపై కూడా అందరిలో చర్చ జరుగుతోంది.
ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం..
హైదరాబాద్లో జరిగే ఖర్గే మీటింగ్ కోసం ప్లాన్ చేస్తున్న హస్తం పార్టీ హైదరాబాద్ ముఖ్యనేతలతో ఇప్పటికే సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్ , ఇన్చార్జి మంత్రి పొన్నం, రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్యాదవ్, ఓబీసీ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్, ఇతర ముఖ్యనేతలు హాజరయ్యారు. జులై 4వ తేదీన ఎల్బీ స్టేడియంలో జరిగే పార్టీ కార్యక్రమం విజయవంతం చేయాలని ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేశారు. దీంతో పెద్ద ఎత్తున కార్యకర్తలను తరలించేందుకు పార్టీ లీడర్లు రెడీ అయ్యారు.