క్వెట్టాను స్వాధీనం చేసుకున్న బీఎల్ఏ
అన్ని ప్రభుత్వ కార్యాలయాలు స్వాధీనం
క్వెట్టాను వదిలి పరారైన పాకిస్థాన్ సైన్యం
బలూచిస్థాన్లో స్థానికుల సంబరాలు
న్యూ ఢిల్లీ, : పాకిస్థాన్ మరోసారి రెండు ముక్కలు కానుందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. మనతో పాటు స్వాతంత్య్రం పొందిన పాకిస్థాన్.. విశాల దేశాన్ని పాలించడంలో విపలమైంది. 1971లో తూర్పు పాకిస్తాన్లో రాజకీయ, ఆర్థిక అసమానతలు, బెంగాలీ భాషా ఉద్యమం కారణంగా ప్రజలు పాకిస్తాన్ పాలనపై తిరుగుబాటు చేశారు. ఇది బంగ్లాదేశ్ విముక్తి యుద్ధానికి దారితీసింది. బంగ్లాదేశ్ కు మద్దతు ఇచ్చిన క్రమంలో పాక్పై భారత్ యుద్దానికి దిగంది. బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారితీసిన 1971 నాటి భీకరమైన యుద్ధం దాదాపు 13 రోజులు కొనసాగి, డిసెంబరు 16వ తేదీన ముగిసింది. ఈ యుద్ధంలో భారత సైనిక బలగాల దెబ్బకు పాకిస్థాన్ సైనికులు తోకముడిచి పారిపోయారు. పాకిస్థాన్ ఆర్మీ జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీ తన 93,000 మంది సైనికులతో, భారత సైన్యం.. ముక్తి-బాహిని ముందు లొంగిపోయారు. దీంతో తూర్పు పాకిస్థాన్ విభజనకు దారితీసింది. బంగ్లాదేశ్ అని పిలిచే కొత్త దేశంగా ఆవిర్భవించింది. పాకిస్తాన్ సైన్యాలను ఓడించి, బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడింది. మళ్లీ అలాంటి పరిస్థితులే ఇప్పడు బలూచిస్థాన్లో కనిపిస్తున్నాయి.
బలూచిస్థాన్ నేపథ్యం ..
బలూచిస్థాన్..! పాకిస్థాన్లో ఉన్నా.. అక్కడి పౌరులకు స్వేచ్ఛ లేదు.. విద్య, వైద్యం అందని పరిస్తితి. పాకిస్థాన్లో 44 శాతం విస్తీర్ణం ఉన్న బలూచిస్థాన్ ప్రాంతాన్ని పాక్ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. అక్కడి ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణిస్తున్నాయి. దీంతో స్వతంత్ర దేశంగా ప్రకటించాలని అక్కడి పౌరులు 75 ఏళ్లుగా పోరాడుతున్నారు. ఇప్పుడు పాక్పై భారత్ దాడి నేపథ్యంలో బలూచీలు తమ కలను సాకారం చేసే దిశలో ముందుకు సాగుతున్నారు.
ఇదీ బలూచిస్థాన్ కథ
బ్రిటిష్ వారు 1947 ఆగస్టు 15న భారత్-పాకిస్థాన్ను విభజించి, స్వాతంత్య్రం ప్రకటించినా.. బలూచిస్థాన్ ప్రాంతం ‘ఖాన్ ఆఫ్ కలాత్’ అనే రాజు పాలనలో కొనసాగింది. అయితే.. 1948 మార్చిలో పాకిస్థాన్ ప్రభుత్వం సైనిక చర్యను చేపట్టి.. ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. పాకిస్థాన్లో విలీనం చేసుకుంది. పాకిస్థాన్ విస్తీర్ణంలో బలూచిస్థాన్ వాటా 44శాతంగా ఉంటుంది. అయితే.. పాక్ జనాభాలో బలూచీల వాటా 7-8 మాత్రమే. పాక్ దురాక్రమణ నుంచి ఈ ప్రాంత ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ఈ ప్రాంతంలోని వనరులను పాకిస్థాన్, చైనా దోచుకుంటున్నాయి. యువకులను పాక్ సైన్యం అపహరిస్తోంది. అలా అదృశ్యమయ్యే వారి జాడ నేటికీ తెలియలేదంటే.. బలూచీల దుర్భర పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
బీఎల్ఏ ఆవిర్భావం.. దాడులు ముమ్మరం
2000 సంవత్సరంలో బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ఆవిర్భవించింది. స్వతంత్ర బలూచిస్థాన్ దేశం కోసం గెరిల్లా యుద్ధాలతో పాకిస్థాన్ సైన్యంపై దాడులు చేసేది. క్రమంగా బీఎల్ఏ బలం పుంజుకుంది. పాకిస్థాన్ సైనికులు, వారి కార్యాలయాలు, కంటోన్మెంట్ ప్రాంతాలు, పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ భవనాలను టార్గెట్గా చేసుకుని, దాడులు జరుపుతోంది. ప్రస్తుతం బీఎల్ఏ చీఫ్గా బషీర్ జైబ్ వ్యవహరిస్తున్నారు. 2018 వరకు ఆయన సోదరుడు అస్లాం బలూచ్ ఈ పదవిలో ఉండేవారు. ఆయన మరణం తర్వాత బషీర్ జైబ్ బాధ్యతలను స్వీకరించాక.. బీఎల్ఏ మరింతగా పుంజుకుంది. గెరిల్లా పోరుతోపాటు.. అధునాతన ఆయుధాల వినియోగం, ఐఈడీల ప్రయోగాలు పెరిగాయి. ఆయన నేతృత్వంలోని బీఎల్ఏ.. గ్వాదర్ పోర్టు వద్ద చైనా ఇంజనీర్లు, వారి వాహనాలపై ఐఈడీ దాడులు చేస్తోంది. తాజాగా మంగళ, బుధవారాల్లోనూ బలూచిస్థాన్లో ఐఈడీలు పేల్చి, 21 మంది సైనికులను హతమార్చింది. ఇటీవల క్వెట్టా-పెషావర్ మధ్య నడిచే జాఫర్ ఎక్స్ప్రె్సను హైజాక్ చేసి, సంచలనం సృష్టించింది. స్వతంత్ర దేశంగా బలూచిస్థాన్ను సాధించడానికి పోరాటాలను ముమ్మరం చేసింది.
క్వెట్టాను స్వాధీనం చేసుకున్న బలూచిస్థాన్ ఆర్మీ
పాకిస్తాన్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఒకవైపు భారత ఆర్మీ పాక్ మీద విరుచుకుపడుతోంది. మరోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా దాడి చేస్తోంది. ప్రావిన్షియల్ రాజధాని క్వెట్టాతో అన్ని ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకుంది. పాకిస్థాన్ సైన్యాన్ని బలూచిస్తాన్ నుంచి తరిమికొట్టామని, క్వెట్టాను తమ ఆధీనంలోకి తీసుకున్నామని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. క్వెట్టాలోని పాకిస్థాన్ దళాల ఫ్రాంటియర్ కార్ప్స్ ప్రధాన కార్యాలయంపై బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ దాడి చేసింది. బలూచి తిరుగుబాటుదారులు క్వెట్టాను తమ ఆధీనంలోకి తీసుకున్నారని, పాకిస్థాన్ సైన్యాన్ని అక్కడ నుంచి తరిమేశారని మీడియా వెల్లడించింది.