Three people | ముగ్గురు అరెస్ట్..

Three people | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఫిల్మ్ నగర్ ప్రాంతంలో విజిలెన్స్ అధికారులుగా నటిస్తూ గ్యాస్ డెలివరీ బాయ్‌ను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

హైదరాబాద్ నగరంలోని ఫిల్మ్ నగర్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో మహ్మద్ మన్జూర్ హసన్, మహ్మద్ తౌఫీక్, మహ్మద్ తాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో మన్జూర్ హసన్, తౌఫీక్ ఒక వెబ్‌సైట్‌లో రిపోర్టర్లుగా పనిచేస్తుండగా, తాజ్ డ్రైవర్‌గా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం… ఈ ముగ్గురు కలిసి గ్యాస్ డెలివరీ బాయ్‌ను అడ్డగించి, అతను గ్యాస్ సిలిండర్లను నల్లబజారులో విక్రయిస్తున్నాడని ఆరోపించారు. అతని యజమానికి ఫిర్యాదు చేస్తామని, ఉద్యోగం నుంచి తొలగింపజేస్తామని బెదిరించారు.

కేసు నుంచి తప్పించుకోవాలంటే రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో భయపడిన బాధితుడు, డెలివరీ ద్వారా వచ్చిన నగదును వారికి అప్పగించాడు. అనంతరం ఈ విషయాన్ని తన యజమానికి తెలియజేయడంతో, వారు ఫిల్మ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వారి వద్ద నుంచి రూ.23 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన డబ్బును మరో వ్యక్తికి ఇచ్చినట్లు నిందితులు వెల్లడించగా, ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ నాలుగో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Leave a Reply