TG | ఇది 40శాతం క‌మీష‌న్ల బ‌డ్జెట్ – కేటీఆర్

హైద‌రాబాద్ : ఈ బడ్జెట్ చూస్తుంటే రేవంత్ సర్కార్ 40శాతం కమిషన్ పాలన అనిపిస్తుందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతిపై నిలదీశారు. రైతు కూలీలకు ఇస్తామన్న రూ.12వేలు ఎక్కడా అని ప్రశ్నించారు. బ‌డ్జెట్ స‌మావేశం అనంత‌రం అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… సీఎం రేవంత్ చేతిగాని తనం వల్ల తెలంగాణ ఆకాశం నుంచి పాతాలానికి వెళ్లిందన్నారు. అప్పులు చేసి ఒక్క ప్రాజెక్టు కూడా ప్రారంభించలేదన్నారు. ఇకనైనా ఢిల్లీకి మూట‌లు పంపడం మానుకోవాలని సూచించారు. ఏ ఒక్క ఊర్లో కూడా రుణమాఫీ పూర్తిగా జరగలేదన్నారు.

తొండ‌ముదిరితే రేవంత్…
ఇది పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదని, ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్ అంటూ ఆరోపించారు. తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుందని, ఊసరవెల్లి ముదిరితే సీఎం రేవంత్ రెడ్డి అవుతారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సర్కార్ అందమే సక్కగా లేదని, కానీ అందాల పోటీలు పెట్టేందుకు సిద్ధమవుతోందంటూ మండిపడ్డారు.

“రేవంత్ రెడ్డీ.. రంకెలు వేయడం కాదు బడ్జెట్ అంకెలు ఎటుపోయాయ్. ఆకాశం నుంచి పాతాళానికి బడ్జెట్ పోతోంది. పరిపాలన చేతకాని ప్రభుత్వం కాంగ్రెస్. ఈ బడ్జెట్‍లో ఆరు గ్యారంటీలు గోవిందా. వాటికి పాతర వేశారు. మహిళలు, వృద్ధులకు ఇచ్చిన హామీలను బడ్జెట్‍లో ప్రస్తావించలేదు. తులం బంగారానికీ దిక్కు లేదు. చేనేతకు బీఆర్ఎస్ హయాంలో రూ.1,200 కోట్లు కేటాయించాం. కానీ ఇవాళ చేనేత కార్మికులను రూ.300 కోట్లకు పరిమితం చేశారు. ఆటో కార్మికుల గురించి ప్రస్తావనే లేదు. యాదవ సోదరుల ప్రసక్తే లేదు. వైన్స్ షాపుల్లో 25 శాతం రిజర్వేషన్ గౌడన్నలకు ఇస్తామని హామీ ఇచ్చారు. అదీ కనిపించడం లేదు. చివరికి దళిత సోదరులనూ మోసం చేశారు.

నిరుద్యోగులకు ఒక్క హామీ ఇవ్వలేదు…
ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్, కానీ నియామక పత్రాలు ఇచ్చింది మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. బడ్జెట్‌లో నిరుద్యోగ భృతి గురించి ఒక్క మాటా లేదు. విద్యా భరోసా గురించీ ప్రస్తావన లేదు. గురుకుల పాఠశాలల్లో పిల్లలు చనిపోతే పట్టించుకోలేదు. హైదరాబాద్ మహానగరం పెండింగ్ నగరంగా మారిపోయింది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పేక మేడలా కుప్పకూల్చారు. ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియదు కానీ ట్రిలియన్ డాలర్‌ ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని అంటున్నారు. కరోనా కంటే డేంజర్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది తెలంగాణ ప్రజల బడ్జెట్ కాదు.. కాంగ్రెస్ వికాస్ బడ్జెట్. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే కరెంట్ ఉండదు. ప్రజల సొత్తును కాంగ్రెస్ కార్యకర్తలకు పంచితే ఊరుకోం. వారికి రూ.6వేల కోట్లు పప్పు, బెల్లం మాదిరి పంచిపెట్టబోతున్నారు. తెలంగాణలో పంటలు ఎండుతుంటే.. హైదరాబాద్‌లో అందాల పోటీలు అవసరమా?” అని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *