కర్నూలు బ్యూరో : కర్నూల్ నగరంలోని ఆర్టీసీ డిపో మేనేజర్ సర్ధార్ హుస్సేన్ ఇంట్లో ఈనెల 13న జరిగిన దొంగతనం కేసులో నిందితులను పట్టుకొని మొత్తం సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనంకు వినియోగించిన రంపం, ఇనుప రాడ్డు, 2 మోటారు సైకిళ్ళు కూడా స్వాధీన పరుచుకున్నారు. తాళం వేసిన ఇళ్ళల్లో దొంగతనం చేసే విధానంపై యూట్యూబ్ లలో చూసి నేర్చుకున్నట్లు నిందితులు తెలిపారు.
సర్ధార్ హుస్సేన్ తన కుటుంబంతో కలిసి ఓ ఫంక్షన్ కు హైదారాబాద్ కు వెళ్లగా షేక్షావలి (స్పైస్ డాభాలో పనిచేసే యువకుడు ) తనతో పాటు మరో ఐదుగురు బాలురుతో కలిసి యూట్యూబ్ లో వీడియోలు చూసి తాళాన్ని విరగ్గొట్టి చోరీకి పాల్పడ్డారు. మరుసటిరోజు డిపో మేనేజర్ ఫిర్యాదు మేరకు కర్నూలు త్రీటౌన్ పీఎస్ లో కేసు నమోదు చేశారు. సాంకేతిక ఉపకరణాల సహాయంతో దర్యాప్తు చేపట్టారు. అయితే పూర్తి సమాచారం మేరకు కర్నూలుకు చెందిన షేక్షావలి అతనితో పాటు ఐదుగురు బాలురను నంద్యాల చెక్ పోస్టు దగ్గర ఉన్న కేంద్రీయ విద్యాలయం దగ్గర అదుపులోకి తీసుకుని వారిని సోదాచేయగా, వారి వద్ద నుండి దొంగతనం చేసిన సొత్తును పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుండి దొంగతనానికి వాడిన రంపం, రాడ్డు, 2 మోటార్ సైకిళ్ళు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో దొంగలను పట్టుకున్న కర్నూల్ డీఎస్పీ బాబు ప్రసాద్, కర్నూల్ మూడవ పట్టణ సీఐలు శేషయ్య, నాగ శేఖర్, హెడ్ కానిస్టేబుల్ చెన్నయ్య, సుంకన్న, రంగారావు, పోలీసులు నాగరాజు, కిషోర్, నాగేశ్వరరావు, చంద్రబాబు నాయుడు, ఈ నాగరాజు, తిరుమలేశు, పరశురాముడు, వీరబాబు లకు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ రివార్డులు అందజేశారు. ఈసందర్భంగా జిల్లా ఎస్పీ ఇళ్ళకు తాళం వేసి ఊళ్ళకు వెళ్ళేటప్పుడు స్థానిక పోలీసు స్టేషన్లలో సమాచారం అందించాలన్నారు. ఎల్ హెచ్ ఎంఎస్ ఉపయోగించుకొని నిఘా పెట్టుకోవాలి. ఇళ్ళ చుట్టూ ముందు రోడ్డు బాగా కనపడేవిధంగా సీసీ కెమెరాలు అమర్చుకునేవిధంగా చేయాలని తెలిపారు. కాలనీల్లో కొత్త వ్యక్తులు, అనుమానితులు సంచరిస్తున్నట్లయితే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.