ఈ లోకం తీరు ఒక్కోసారి విచిత్రంగా అనిపిస్తుంది. భగవంతుడు అందరు మానవులను మంచివారుగానే పుట్టించారు. ఎందరో లోక ప్రయోజనం కోసం పాటుపడుతూనే వున్నారు. వీరు ఏ స్వార్థమూ లేకుండా, ఏ లాభము లేకుండా ఏమీ ఆశించకుండా తమ పనులు తాము చేసుకుంటూ పోతూ ఉంటారు. నిరంతరంగా వారు తమ వంతు కృషిని మానవాళి మనుగడను ఆశించి చేసుకుపోతూ వుంటారు. వీరి ఆలోచన కూడా మరో విధంగా వుంటుంది. ఎవ్వరు ఏవిధమైన హితము కోరినా యోగ్యతా యోగ్యతల గురించి పట్టించుకోరు. వారు ఎదుటివారు యోగ్యులా కాదా అన్న విషయాన్ని పట్టించుకోరు. తమకు తోచిన రీతిలో తమ వంతు కర్తవ్యంగా భావించి సాయం చేస్తారు. అంతేకాదు ఇక్కడ వారు సాయం అడిగినవారు ధనవంతులా, బీదవారా అని కూడా ఆలోచించరు. వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు వుండదు. వీరినే ఉత్తములు అని అంటారు. వీరు సమాజానికి మార్గదర్శకులు. వీరే ఉత్తమ స్నేహితులు. వీరి స్నేహంలో మనకు స్వప్రయోజనం గానీ, ఏ సుఖ లౌల్యం కానీ, ఎలాంటి లౌక్యం గానీ కనిపించదు. వారికి కావల్సిందల్లా హితం, లోక హితం, లోక క్షేమం. నిష్కామ క్రియాశీలత్వం వారిది. మానవులను భర్తృహరి తమ సుభాషితంలో ఇలా అన్నారు. తమ కార్యంబు వదులుకుని అయినా ఇతరులకు సాయం చేసేవారు సజ్జనులు, తమ పనులు తాము చేసుకుంటూ ఇతరులకు కూడా సాయం చేసేవారు మధ్యములు, తమ స్వార్థమే ప్రధానంగా ఇతరులకు హాని జరిగినా ఫరవాలేదనుకునేవారు దైత్యులని మూడు తెలగలుగా విభజించారు. నేటి యువత సద్గుణ సంపన్నులై జాతికి సేవ చేయాలి.
- డా||పులివర్తి కృష్ణమూర్తి