TG | తెలంగాణ ఉద్య‌మానికి పునాదులు నిరుద్యోగులే… రేవంత్

హైదరాబాద్: నిరుద్యోగ సమస్య తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లిందని, రాష్ట్ర సాధనలో నిరుద్యోగులు క్రియాశీల పాత్ర పోషించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమానికి నిరుద్యోగులు పునాదులుగా మారారని పేర్కొన్నారు. గత ప్రభుత్వానికి ఉద్యమం పట్ల బాధ్యత లేక నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దొరకలేదన్నారు. గత ప్రభుత్వ పెద్దల ఉద్యోగాలు తీస్తేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని తాను చెప్పినట్లు సీఎం గుర్తు చేశారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. జూనియర్ లెక్చరర్, పాలిటెక్నిక్ లెక్చరర్ల ఉద్యోగాలకు ఎంపికైన 1,532 మందికి సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. కొత్తగా ఉద్యోగ బాధ్యతలు చేపడుతున్న వారికి సీఎం అభినందనలు తెలిపారు. కొత్త అధ్యాపకులు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంవైపు నడిపించాలన్నారు.

“కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 50వేలకు పైగా నియామకాలు చేపట్టాం. ఉద్యోగ నియామకాలకు సంబంధించి కోర్టుల్లో ఉన్న చిక్కుముళ్లు విప్పుతూ సమస్యలు పరిష్కరించాం. గతంలో సంతలో సరకులా ప్రశ్నపత్రాలు అమ్మారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉందని పెద్దలు చెప్పారు. 30వేల ప్రభుత్వ పాఠశాలల్లో 25 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. 11వేల ప్రైవేటు పాఠశాలల్లో 36. 7 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వం కంటే ప్రైవేటు పాఠశాలలు గొప్పవా? ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు రూ.25 వేల వరకు ఖర్చవుతుంటే.. ప్రభుత్వ బడుల్లో రూ. లక్ష వరకు ఖర్చవుతోంది. విద్యార్థుల భవిష్యత్తును విద్యాశాఖ తీర్చిదిద్దాలి. గతంలో విద్యాశాఖ నిర్లక్ష్యానికి గురైంది. విద్యాశాఖను ప్రక్షాళన చేసి ప్రభుత్వం అండగా ఉంది. విద్యకు ప్రాధాన్యం ఇచ్చి విద్యాశాఖకు రూ.21,650 కోట్లు కేటాయించాం” అని సీఎం వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *