హైదరాబాద్, జూన్ 9 (ఆంధ్రప్రభ ) : మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) మృతి చాలా బాధాకరం అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) విచారం వ్యక్తం చేశారు. సోమవారం మాదాపూర్ లోని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపీనాథ్ నివాసానికి మాజీ హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి వెళ్ళి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం గోపీనాథ్ సతీమణి, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపం (Deepest condolences), సానుభూతి తెలిపారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని, దైర్యంగా ఉండాలని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… 1992 నుండి మాగంటి గోపీనాథ్, తాను ఒక సోదరుడిగా, మంచి మిత్రులుగా కలిసి రాజకీయాల్లో ఉన్నామని గుర్తు చేసుకున్నారు. గత నెల 26వ తేదీన తాను కుటుంబ సభ్యులతో కలిసి ఆస్ట్రేలియా పర్యటన (Australia tour) కు వెళ్ళామని, వెళ్ళే ముందు కూడా తాము కలుసుకున్నామని వివరించారు. ఇంతలోనే ఇలా జరిగిందని పేర్కొన్నారు.
గోపీనాథ్ మృతి వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పారు. భౌతికంగా గోపీనాథ్ దూరమైనప్పటికీ మూడు పర్యాయాలు ఎమ్మెల్యే గా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. జూబ్లీహిల్స్ (Jubilee Hills) నియోజకవర్గ పరిధిలోని పార్టీ శ్రేణులు కూడా ధైర్యంగా ఉండాలని కోరారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంట మలక్ పేట నియోజకవర్గ ఇంచార్జి ఆజాం, అమీర్ పేట డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు నామన సంతోష్ కుమార్, అశోక్ యాదవ్, శ్రీహరి, ఆరీఫ్, హరిసింగ్, నారాయణ రాజు, తదితరులున్నారు.
