ధారూర్, జూన్10 (ఆంధ్రప్రభ) : దోర్నాల (Dornala) గ్రామ సమీపంలో సీడ్స్ కంపెనీని వెంటనే తొలగించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. 2014 సంవత్సరంలో ప్రారంభమైన ఈ కంపెనీ నుంచి వెలువడే దుర్వాసన వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా దీనిపై జిల్లా అదికారుల దృష్టికి తీసుకెళ్లామని గ్రామస్తులు పేర్కొంటున్నారు. గత రాత్రి సమయంలో సీడ్స్ కంపెనీ (Seeds Company) నుంచి దుర్వాసన రావడంతో పశువుల కళేబరాలు తీసుకుని వస్తున్నారన్న సమాచారం తెలుసుకుని దోర్నాల గ్రామ ప్రజలు వాహనాలను అడ్డుకొని గ్రామంలోకి తీసుకునివచ్చారు.
రాత్రి నుంచి వాహనాలను వదిలిపెట్టకుండా ఉదయం రోడ్డుపై బైఠాయించి ధర్నా (Dharna) చేపట్టారు. ఇవాళ వికారాబాద్ ఆర్డీఓ వాసుచంద్ర, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, అధికారులు తహశీల్దార్ సాజిదాబేగం ఘటనా స్థలానికి చేరుకుని గ్రామ ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే గ్రామస్తులు వెంటనే ఆ సీడ్స్ కంపెనీని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
