అమృత్ సరోవర్ పథకానికి తెలంగాణ సహకరించాలి
ఎలక్ట్రికల్ వెహికల్స్తో కాలుష్య నివారణ
అందుకే ప్రోత్సహిస్తున్నాం
మేడారం, భద్రాద్రి, బాసరలకు జాతీయ రహదారితో అనుసంధానం
తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
కాగజ్నగర్, ఆంధ్రప్రభ : రహదారులు బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో మహారాష్ట్ర సరిహద్దులో రూ.3,526 కోట్లతో నిర్మించిన 95 కిలోమీటర్ల మేర ఫోర్ లైన్స్ రోడ్డు, పలు అభివృద్ధి పనులు, కొత్త వంతెనల నిర్మాణం, రహదారుల విస్తరణకు ఆయన ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రహదారులు మెరుగ్గా ఉండే దేశాన్నే అభివృద్ధి చెందిన దేశంగా భావిస్తారని పేర్కొన్నారు. వ్యవసాయం, ఉపాది, రవాణా, మౌలిక వసతులు అనే నాలుగు అంశాలు దేశాభివృద్ధిని నిర్దేశిస్తాయన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు.
రాష్ట్రాల మధ్య అనుసంధానం పెంచుతాం
రాష్ట్రాల మధ్య అనుసందానం పెంచేందుకు కీలకమైన ప్రాజెక్టును చేపట్టామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రోడ్డు కనెక్టివిటీలో భాగంగా క్లిష్టమైన వంతెనలు, సొరంగ మార్గాలు నిర్మిస్తున్నాం జోజిలా పాస్ టన్నెల్ వంటి నిర్మాణాలను చేపట్టామన్నారు. సూర్యాపేట నుంచి దేవరపల్లి వరకు గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మించనున్నామన్నారు. నాగ్పుర్ నుంచి విజయవాడ కారిడార్ చేపట్టాం తెలంగాణ-మహారాష్ట్ర మధ్య రోడ్డు కనెక్టివిటీ మరింత పెరగనుందని చెప్పారు. భద్రాచలం, బాసర, మేడారం వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తామన్నారు. జగిత్యాల-కరీంనగర్ హైవే విస్తరణ పనులను త్వరలోనే చేపడతామన్నారు. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు ఎన్నో ప్రాజెక్టులు చేపట్టామని చెప్పారు. . కాలుష్య నియంత్రణలో భాగంగా ఎలక్ట్రిక్ సీఎన్ని వాహనాలను ప్రోత్సహిస్తున్నాం. పెట్రోల్ వాహనాలకు బదులుగా విద్యుత్ వాహనాలు పెరగాలన్నారు.
అమృత్ సరోవర్ పథకానికి తెలంగాణ సహకరించాలి
అమృత్ సరోవర్ పేరుతో నీటి నిల్వలను పెంచుతున్నామని ఈ పథకానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని గడ్కరీ కోరారు. రాష్ట్రంలో నీటి సరస్సులను గుర్తిస్తే అభివృద్ధి చేస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఆదివాసీల జిల్లా ఇది అని, ఈ జిల్లాకు ఎక్కువ సార్లు రావడానికి నేను ఇష్టపడతానన్నారు. రోడ్డు కనెక్టివిటీలో భాగంగా క్లిష్టమైన వంతెనలు, సొరంగ మార్గాలు నిర్మిస్తున్నామనిజొజిలా పాస్ టన్నెల్ వంటి క్లిష్టమైన నిర్మాణాలను చేపట్టామన్నారు. తెలంగాణలోనూ పలు జిల్లాల్లో జాతీయ రహదారులు నిర్మిస్తున్నామని హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు ఎన్నో ప్రాజెక్టులు చేపట్టినట్టు చెప్పారు.
ప్రతీపేదవాడికి సంక్షేమ పథకం
ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. వెనకబడిన జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం పని చేస్తున్నామన్నారు. కాలుష్య నియంత్రణలో భాగంగా ఎలక్ట్రిక్, సీఎన్ జీ వాహనాలను ప్రోత్సహిస్తున్నామని, పెట్రోల్ వాహనాలకు బదులుగా ఈవీ, సీఎన్జీ వాహనాలు ఇంకా పెరగాలన్నారు. దేశంలో నీళ్ల కొరత లేదని నీటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలం అవుతున్నామన్నారు. రాష్ట్రాల మధ్య అనుసంధానం పెంచేందుకు కీలకమైన ప్రాజెక్టులను కేంద్రం చేపట్టిందన్నారు. పోలవరం నుంచి వృథాగా సముద్రంలోకి నీళ్లు వదులుకుంటున్నామన్నారు.
జాతీయ రహదారి వస్తరణతో ప్రమాదాల నివారణ : మంత్రి కిషన్ రెడ్డి
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ “జాతీయ రహదారుల విస్తరణ వల్ల రోడ్డు ప్రమాదాలు, ప్రయాణ సమయం భారీగా తగ్గాయని అన్నారు. రోడ్డు. రైల్వే విమాన కనెక్టివిటీ పెంచేందుకు కేంద్రం అంకితభావంతో పనిచేస్తోందని అన్నారు. దేశవ్యాప్తంగా ఏడు టెక్స్ టైల్ పార్కులు మంజూరు చేస్తే తెలంగాణకు కూడా ఒకటి దక్కిందని, రూ.6,330 కోట్లతో రామగుండంలో యూరియా ఉత్పత్తి పరిశ్రమను పునరుద్ధరించుకున్నామని చెప్పారు. ఇచ్చిన హామీ ప్రకారం నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు మంజూరు చేశామని, ఆదిలాబాద్ డిఫెన్స్ ఎయిర్పోర్టు ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధమవుతోందని అన్నారు. దేశంలో 80 కోట్ల మంది పేదలకు ఉచితంగా రేషన్ బియ్యాన్ని మోదీ ప్రభుత్వం అందజేస్తోందని కేంద్ర అందజేస్తోందని కిషన్ రెడ్డి అన్నారు.
చొరవ తీసుకోవాలి : మంత్రి సీతక్క
ఎలాంటి వివక్ష లేకుండా రోడ్ల అనుసంధానం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు కేటాయించాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. అటవీ అనుమతులు లేకపోవడంతో చాలా అటవీ ప్రాంత పల్లెలకు రోడ్ల కనెక్టివిటీలో జాప్యం జరుగుతోందని, అందువల్ల వీటికి త్వరగా అనుమతులు వచ్చేలా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చొరవ తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. అభివృద్ధి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
మంత్రి కోమటిరెడ్డి భోళా మనిషి : కేంద్ర మంత్రి సంజయ్
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓ భోళా మనిషి అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బహిరంగ సభలో కేంద్ర బండి సంజయ్ మాట్లాడుతూ.. ఒకప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే వెనుకబడిన ప్రాంతంగా ఉండేదని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక జిల్లా రూపురేఖలు పూర్తిగా మారుతున్నాయని అన్నారు. రోడ్ల అభివృద్ధి పనుల కోసం తెలంగాణ నుంచి ఏ ఎంపీ అయినా.. పార్టీలతో సంబంధం లేకుండా మంత్రి నితిన్ గడ్కరీ దగ్గరికి వెళితే క్షణాల్లో పని అవుతుందని అన్నారు. తన మనసులో ఎలాంటి విద్వేషాలు ఉండవని.. ఏది ఉన్నా ఓపెన్గా చెప్పే మనస్తత్వమని అన్నారు.