TG | కొత్త సంప్రదాయాలతో భక్తులకు ఇబ్బంది కలిగించ వద్దు : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్ : కొత్త సంప్రదాయాలకు తెరతీసి భక్తులను ఇబ్బందులకు గురి చేయొద్దని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం బల్కంపేట ఎల్లమ్మ ఆలయం లో కళ్యాణం సందర్భంగా అమ్మవారికి సమర్పించనున్న పోచంపల్లి పట్టువస్త్రాలను పద్మశాలి సంఘం జయరాజ్ ఆధ్వర్యంలో మగ్గం పై తయారు చేసే పనులను ప్రారంభించారు. వస్త్రాల తయారీ కి ముందుకొచ్చిన వారిని ఆయన అభినందించారు. ముందుగా ఎల్లమ్మ అమ్మవారిని, పోచమ్మ అమ్మవార్లను దర్శించుకొని పూజలు నిర్వహించారు.

ఈ సదర్భంగా జులై 1 వ తేదీన నిర్వహించనున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం ఏర్పాట్లపై దేవాలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అమ్మవారి కళ్యాణం లో పాల్గొనే దంపతులకు ఇచ్చే టికెట్లను తగ్గిస్తున్నారని, దాతలకు ఇచ్చే పాస్ లను తగ్గిస్తున్నారనే విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే అధికారులను ఈ విషయమై ప్రశ్నించారు. కొత్త విధానాల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంటుందని, పాత పద్దతులనే అవలంభించాలని అధికారులకు ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

అమ్మవారిపై భక్తి తో ఆలయ అభివృద్ధి లో భాగస్వాములుగా ఉన్మ దాతలను అవమానిస్తారా అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆలయం ఎంతో అభివృద్ధి చెందిందని, అమ్మవారి వద్దకు వచ్చే భక్తుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని వివరించారు. అమ్మవారి కళ్యాణానికి వచ్చే వారి సంఖ్య కూడా ప్రతి ఏటా పెరుగుతుందని తెలిపారు. లక్షలాదిగా వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు.

బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి కోటి రూపాయల విరాళం అందజేయడం పట్ల ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ కి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఆ నిధులను ఫిక్స్ డ్ డిపాజిట్ చేసి వచ్చే వడ్డీ తో అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని ఆలయ అధికారులకు సూచించారు.

*అమ్మవారికి బంగారు బోనం*

బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి జులై 2 వ తేదీన పాత బస్తీకి చెందిన ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో బంగారు బోనం సమర్పిస్తారని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సుమారు 500 మంది వివిధ దేవాలయాలకు చెందిన కమిటీ ప్రతినిధులు అమ్మవారికి బోనం సమర్పించే కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు.

ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, ఆలయ ట్రస్ట్ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఈ ఓ మహేందర్ గౌడ్, సూపరింటెండెంట్ హైమవతి, బి ఆర్ ఎస్ పార్టీ నగర ఆధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు అశోక్ యాదవ్, నామన సంతోష్ కుమార్, కూతురు నర్సింహ, బలరాం, శ్రీనివాస్ గౌడ్, వనం శ్రీనివాస్, రాజేష్ ముదిరాజ్, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply