హైదరాబాద్లో పెద్ద ఎత్తున జ్వర బాధితులు
ప్రైవేటు ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్
అలర్ట్ చేసిన వైద్య ఆరోగ్యశాఖ
దోమలతోనే రోగాలు వ్యాప్తి
జాగ్రత్తలు పాటించాలన్న అధికారులు
సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ : వానలతో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. తాగునీటి కలుషితంతో జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, తలనొప్పి వంటి సమస్యలతోపాటు డెంగీ, మలేరియా, టైఫాయిడ్, డయేరియాలాంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలనున్నాయి. ఈ నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. ప్రైవేటు హాస్పిటల్స్ నుంచి డెంగీ, మలేరియా, గన్యా, స్వైన్ ఫ్లూ, కరోనాలాంటి వ్యాధులపై ఏరోజు సమాచారం ఆరోజు ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫాం (ఐహెచ్ఐపీ)లో నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రోగి చిరునామా, ఫోన్ నెంబర్ సేకరించాలని సూచించింది.
దోమలతో రోగాలు వ్యాప్తి..
వాన నీటి నిల్వతో డెంగీ (టైగర్) దోమలు పెరుగుతాయి. దోమలు కుట్టిన 7-8 రోజుల్లో హఠాత్తుగా జ్వరం, కాళ్లు కదలించలేని పరిస్థితి వస్తుంది. ఎముకలు, కండరాల్లో భరించలేని నొప్పి ఉంటుంది. శరీరంపై దుద్దర్లు, వాంతులు, వికారం లక్షణాలు ఉంటాయి. కొందరిలో ప్లేట్లెట్స్ తగ్గి షాక్ సిండ్రోమ్కు దారి తీస్తుందని హైదరాబాద్ గచ్చిబౌలిలోని గమన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య నిపుణులు చెబుతున్నారు.
= వానాకాలంలో మలేరియా వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఈ జ్వరానికి కారణమయ్యే ‘ప్లాస్మోడియం’ పరాన్నజీవి ఆడ అనాఫిలస్ దోమ ద్వారా వ్యాపిస్తుంది.
= చల్లని వాతావరణంతో ఫ్లూ వ్యాధి కూడా ఇబ్బంది పెడుతుంది. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారిపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. ముక్కు కారటం, జలుబు, దగ్గు, ఆయాసం లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాలి
ఈ టిప్స్ పాటించాలంటున్న డాక్టర్లు..
హైదరాబాద్లోని అన్ని పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఇప్పటికే అప్రమత్తం చేశామని వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. మలేరియా, డెంగీ టెస్టుల పరికరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. త్వరలో ఇంటింటి సర్వే చేయనున్నట్లు పేర్కొన్నారు. మలేరియా, డెంగీ కేసుల విషయంలో ప్రైవేటు హాస్పిటల్స్ బాధ్యతాయుతంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
ఈ విషయాల్లో మరింత జాగ్రత్త..
రోడ్లపైన గుంతలు, ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని వైద్య అధికారులు సూచించారు. దోమ తెరలు వాడాలని, పిల్లలకు కాళ్లు, చేతులు కప్పి ఉంచేలా దుస్తులు వేయాలని తెలిపారు. కాచి చల్లార్చి వడబోసిన నీటినే తాగాలని, బయట తిండికి బదులు ఇంట్లో ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని వివరించారు. పూలకుండీలు, కూలర్లు, నీటిని నింపే డ్రమ్ములు, పాత్రలను వారంలో ఒకసారి పూర్తిగా ఎండబెట్టాలన్నారు. ఇంటిచుట్టూ ప్లాస్టిక్ కవర్లు, కొబ్బరి చిప్పలు, చెత్తాచెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.