అమ్రాబాద్, ఆంధ్రప్రభ : ఎస్ఎల్బీసీలో ఏడుగురు ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ నిరంతరం కొనసాగుతోందని డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ తెలిపారు. మంగళవారం ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆఫీస్ వద్ద సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
అనంతరం వారు మాట్లాడుతూ కేరళకు చెందిన కడవల్ డాగ్స్ స్క్వాడ్ టన్నెల్ లోకి వెళ్లినట్లు తెలిపారు. టన్నెల్ బోరింగ్ మిషన్ యొక్క ఫ్లాట్ ఫాం భాగాలని కత్తిరించే పనులు వేగంగా జరుగుతున్నాయని,సమాంతరంగా టిబిమ్ పై నున్న మట్టిని తొలగించే పనులు రెట్టింపు వేగంతో సహాయక బృందాలు పూర్తిస్థాయిలో 24 గంటలు సహాయక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. మట్టిని కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు తరలిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం, సింగరేణి మైన్స్ రెస్క్యూ టీమ్, ఆర్మీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్,ర్యాట్ హోల్ మైనర్స్,కడావర్ డాగ్స్, హైడ్రా, అన్వి రోబోటిక్స్,దక్షిణ మధ్య రైల్వే, జీఎస్ఐ, జలవనరుల శాఖ తదితరులు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు.