TG| బిసి రిజ‌ర్వేష‌న్ పెంపుపై ప్ర‌ధాని మోదీని క‌లుస్తాం – మంత్రి పొన్నం

హైద‌రాబాద్ – రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని ఢిల్లీకి వెళ్లి బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించేందుకు కృషి చేస్తామని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ పేర్కొన్నారు. ఇక బీసీ రిజర్వేషన్ల అంశంలో కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని, తమిళనాడు తరహాలో షెడ్యూల్-9 పెట్టాలని కేంద్రాన్ని కోరతామని తెలిపారు. ఈ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహకారం అందిస్తారని అశిస్తున్నామ‌ని తెలిపారు.

హైద‌రాబాద్ లో నేడు జ‌రుగుతున్న బిసి నేత‌ల స‌మావేశానికి వ‌చ్చిన మంత్రి మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ బీజేపీ నేతలు కూడా బీసీల ప్రయోజనాలను గుర్తించి రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేలో 96.9% మంది పాల్గొన్నారని, కేవలం 3.1% మంది మాత్రమే అందులో పాల్గొనలేదని వివరించారు. ఈ క్రమంలో, రెండో విడత కులగణన సర్వేలో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ హక్కులను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

కుల‌గ‌ణ‌న‌లో దేశానికే దిక్సూచి…..
తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా కులగణన చేపట్టి దేశానికి దిక్సూచిగా నిలిచిందని పొన్నం ప్రభాకర్ గర్వంగా ప్రకటించారు. కులగణన సర్వేపై అనవసర విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలు కూడా ప్రజల ప్రయోజనాలను గుర్తించి ఇందులో పాల్గొనాలని సూచించారు. ఈ గణన వల్ల బీసీల అసలైన జనాభా గణనలోకి వచ్చి, వారికి న్యాయం జరిగే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. సర్వేలో పాల్గొనడం వలన బీసీ జనాభా గణనకు సరైన దిశలో ఆందోళనలు నడిపించవచ్చని, బీసీల హక్కుల కోసం పోరాడే వారు తప్పకుండా ఇందులో పాల్గొనాలని మంత్రి అన్నారు. అయితే, ఈ సర్వేను అర్థం చేసుకోకుండా, రాజకీయ కారణాలతో విమర్శలు చేయడం సరైన ధోరణి కాదని చెప్పారు

తెలంగాణ బీసీలకు సముచిత హక్కులు, సరైన ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల అమలుతో పాటు, సర్వే ద్వారా వారికున్న పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకొని, భవిష్యత్తులో మరింత ప్రాధాన్యతనిచ్చే విధంగా ప్రభుత్వ విధానాలను రూపొందిస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *