TG | ఆర్టీసీ లో స‌మ్మె వ‌ద్దంటే వ‌ద్దు – కార్మికుల‌కు రేవంత్ విన‌తి

హైద‌రాబాద్ – ఆర్టీసీ కార్మికులు సమ్మె ఆలోచన వీడండి అని కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోంద‌ని, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆర్టీసీ కార్మికులపైనే ఉంది అన్నారు. ర‌వీంద్ర భార‌తిలో నేడు జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ, గత పదేళ్లలో విధ్వంసం జరిగింద‌ని,.. రాష్ట్రంలో ఆర్ధిక దోపిడీ కొనసాగిందన్నారు. ఆర్టీసీ కార్మికులు పంతాలు, పట్టింపులకు పోకండి.. ఏదైనా సమస్య ఉంటే మంత్రిగారితో చర్చించండి.. వచ్చే ఆదాయమంతా మీ చేతిలో పెడతాం.. ఎలా ఖర్చు చేద్దామో మీరే సూచన చేయండి అన్నారు. అణా పైసా కూడా నేను ఇంటికి తీసుకెళ్లేది లేదు.. మీ కోసమే ఖర్చు చేస్తాం.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేదు.. అందుకే ఒకసారి ఆలోచించండి అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఇక, కష్టమైనా, నిష్ఠూరమైన ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది అని రేవంత్ రెడ్డి తెలిపారు. సమ్మె పోటు రాష్ట్రానికి నష్టం చేస్తుంది.. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతోంది.. మరో ఏడాదిలో కొంత కుదురుకుంటుంది.. పదేళ్లు ఏం చేయని వాళ్లు వచ్చి చెబితే వాళ్ల వలలో పడొద్దు.. వారి విషపు చూపుల్లో చిక్కుకోవద్దు అని సూచించారు. ఆర్టీసీ కార్మికులు నన్ను నమ్మండి.. నమ్ముకున్న మీకు అండగా ఉంటాను అని చెప్పుకొచ్చారు.

కెసిఆర్ అప్పుల్లో ముంచి వెళ్లారు..

తెలంగాణ రాష్ట్రాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.8.15 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని, ఆ డబ్బంతా ఎక్కడకి పోయిందో కూడా తెలియడం లేదని రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించడానికే తమ ప్రభుత్వం కొత్తగా రూ.1.58 లక్షల కోట్లు రుణం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించకుండా విచ్చలవిడిగా అప్పులు చేసిందని ఆరోపించారు.

సుమారు లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కూలిపోయిందని, ఇది గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు గ్యాస్ సిలిండర్‌ను రూ.500కే అందిస్తున్నామని, తొలి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణ, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.8.15 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా ఎలా మారిందని ప్రశ్నించారు. రాష్ట్ర ఖజానా దివాలా తీస్తే, కేసీఆర్ కుటుంబానికి మాత్రం ఫామ్‌హౌస్‌లు, మీడియా సంస్థలు ఎలా సమకూరాయని ఆయన నిలదీశారు. నిరసన తెలిపే ప్రజాస్వామిక హక్కు కూడా లేకుండా ధర్నా చౌక్‌ను మూసివేయడాన్ని ఆయన తప్పుపట్టారు.

ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉందని వివరించారు. ప్రభుత్వానికి ప్రతినెలా సుమారు రూ.18 వేల కోట్ల ఆదాయం వస్తుంటే, అందులో రూ.6 వేల కోట్లు గత ప్రభుత్వ అప్పుల కిస్తీలకు, మరో రూ.6 వేల కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకే సరిపోతోందని తెలిపారు. రాష్ట్ర కనీస అవసరాలు తీరాలంటే నెలకు రూ.22 వేల కోట్లు అవసరమని, ఇలాంటి పరిస్థితుల్లో కొత్త డిమాండ్లు రావడం సరికాదని అన్నారు.
సర్పంచ్‌లకు చెల్లించాల్సిన బకాయిలు కూడా గత ప్రభుత్వమే మిగిల్చిందని, ఆర్థిక వనరులు లేకున్నా అడ్డగోలుగా అప్పులు తెచ్చారని ఆరోపించారు. యువతకు ప్రస్తుత పరిశ్రమల అవసరాలకు తగిన నైపుణ్యాలు అందించేందుకు స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.

తమ ప్రభుత్వం కూలిపోవాలని మాజీ సీఎం కేసీఆర్ రోజూ శాపనార్థాలు పెడుతున్నారని, అయితే పిల్లి శాపాలకు ఉట్టి తెగిపడదన్న విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలని రేవంత్ రెడ్డి హితవు పలికారు. కేసీఆర్‌ను ‘కపట నాటక సూత్రధారి’గా అభివర్ణించిన సీఎం, ప్రజలు ఆయన మాటలు నమ్మి మళ్లీ మోసపోవద్దని హెచ్చరించారు. ఏమైనా సమస్యలుంటే కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకుందామని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply