హైదరాబాద్: ఇంజినీరింగ్ (Engineering ) ఫీజుల (fees) విషయంలో తెలంగాణ ప్రభుత్వం ( Telangana government) కీలక నిర్ణయం తీసుకుంది. కోర్సులన్నింటికీ ఈ ఏడాది ( this year) పాత ఫీజులే కొనసాగించాలని నిర్ణయించింది.
ఈ మేరకు 2025-26 విద్యా సంవత్సరానికి పాత ఫీజులు కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బీటెక్, బీఈ, ఎంఈ, ఎంటెక్ సహా, బి- ఒకేషనల్ కోర్సులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంది.
ఇంజినీరింగ్లో ఫీజులు భారీగా పెరుగుతుండటంపై సీఎం రేవంత్రెడ్డి అసంతృప్తి వ్యక్తంచేయడం, రుసుములు ఖరారుచేసే ముందు అన్ని కోణాల్లో అధ్యయనం చేయాలని ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా ఓ కమిటీని నియమించి ఇతర రాష్ట్రాల్లో ఫీజుల విధానంపైనా అధ్యయనం చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.అయితే, ఈ వ్యవహారం ఇప్పట్లో తేలే అవకాశం లేకపోవడంతో.. ప్రవేశాల కౌన్సెలింగ్ ఆలస్యం కాకుండా పాత ఫీజుల ప్రకారమే (ఇంజినీరింగ్లో గరిష్ఠ ఫీజు రూ.1.65 లక్షలు) తొలుత ఎప్సెట్ కౌన్సెలింగ్ ప్రారంభించాలని ఉన్నత విద్యామండలి అధికారులు భావించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
మరోవైపు, పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తిచేసిన వారు ఈసెట్ ద్వారా నేరుగా బీటెక్, బీఫార్మసీ రెండో ఏడాది కోర్సుల్లో చేరనున్నారు. దీంతో ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు పొందుతున్నందున ఆ విద్యార్థులకు సైతం తాజా నిర్ణయం ప్రకారం పాత ఫీజులే వర్తించనున్నాయి.