హైదరాబాద్ – తెలంగాణ మంత్రివర్గంలో మున్నూరుకాపులకు ప్రాధాన్యత లేకుండా పోయిందని, పార్టీల్లోనూ ప్రాధాన్యత కూడా దక్కడం లేదని ఆ సామాజిక వర్గం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు నివాసంలో మున్నూరు కాపు సామాజిక వర్గం నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీకి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి కీలక నేతలు హాజరయ్యారు. మున్నూరు కాపు నేతలకు ప్రాధాన్యత దక్కడం లేదని పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కులగణనపై కృతజ్ఞత సభ పెడదామని కాంగ్రెస్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రతిపాదించారు. కులగణన సరిగ్గా చేయలేదని పలువురు మున్నూరు కాపు సామాజిక వర్గం నేతలు వ్యాఖ్యానించారు. మన సామాజిక వర్గం సంఖ్యను తగ్గించారని పేర్కొన్నారు.
మంత్రివర్గంలో మున్నూరు కాపులకు ప్రాధాన్యత లేకపోవడం ఇదే తొలిసారి అన్నారు. నామినేటెడ్ పోస్టుల్లోనూ అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లో కాపులకు దక్కిన ప్రాధాన్యత కాంగ్రెస్లో కరువైందని అన్నారు. మున్నూరు కాపులు మంత్రి వర్గంలో లేక పోవడం ఇదే మొదటి సారి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ మున్నూరుకాపు నేతలకు కీలక పదవులు ఇచ్చింది.. అంతే విధేయతతో పనిచేశామని నేతలు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ కూడా మున్నూరు కాపులు అవసరాన్ని గుర్తించారు.. రెండు సార్లు మంత్రి వర్గంలో తీసుకున్నారని తెలిపారు. ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలుగా నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించారని పేర్కొన్నారు. బీజేపీ కూడా మున్నూరు కాపు నేతలకు ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.
బీజేపీ, బీఆర్ఎస్ నుండి దక్కినన్ని ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు.. కాంగ్రెస్ నుండి రాలేదని,. నామినేటెడ్ పోస్టుల్లో అన్యాయం జరుగుతోందని నేతలు పేర్కొన్నారు. మున్నూరు కాపులను అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదనే అభిప్రాయం నేతలు వ్యక్తం చేశారు. డి.శ్రీనివాస్, కేకే, వీహెచ్, పొన్నాలకు దక్కిన స్థాయి నేడు కాంగ్రెస్లో లేదని అసంతృప్తిగా ఉన్నారు. ఓ సామాజిక వర్గం తమ మీద కుట్రలే కాదు.. దాడి చేసినంత పని చేస్తోందన్నారు. మన ప్రాధాన్యత తగ్గిస్తే.. మనం కూడా తగ్గించడం అనివార్యమన్నారు నేతలు.
మరోవైపు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెండ్ అంశం పై కూడా చర్చ జరిగింది. ఎమ్మెల్సీ మల్లన్న ఎత్తుకున్న నినాదం కరక్టే కానీ పార్టీ లైన్కు కట్టుబడి ఉండాలన్నారు.. ఒక బీసీ నేతపైనే కాదు.. పార్టీ లైన్ దాటిన ఇతర నేతలపై కూడా ఇదే రకమైన చర్యలు ఉండాలని నేతలు అభిప్రాయ పడ్డారు. కృతజ్ఞత సభకు బదులు.. మున్నూరు కాపుల భారీ బహిరంగ సభ నిర్వహించాలని నేతలు నిర్ణయం తీసుకున్నారు.