భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం చెన్నై చేరుకుంది. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో రేపు (శనివారం) చెన్నైలో డీలిమిటేషన్పై జరిగే అఖిలపక్ష సమావేశంలో కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం పాల్గొననుంది.
రేపటి దక్షిణాది రాష్ట్రాల సమావేశంలో, ప్రస్తుత డీలిమిటేషన్ ప్రక్రియను, దక్షిణాదిపై దాని ప్రభావాన్ని విమర్శిస్తూ.. కేటీఆర్ చెన్నై మీడియాతో మాట్లాడారు.
డీలిమిటేషన్ ప్రతిపాదనను మా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని కేటీఆర్ అన్నారు. డీలిమిటేషన్ ప్రతిపాదన వలన ప్రాంతీయ విభేదాలు తలెత్తుతాయని కేటీఆర్ అన్నారు. కొన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం పెరిగి మరికొన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గడం వలన అనేక ప్రాంతీయ అసమానతలు ఏర్పడి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
‘‘దక్షిణ భారతదేశానికి ఇచ్చే నిధుల కన్నా వచ్చే నిధులు మరింతగా తగ్గిపోతాయి. కేంద్రం నుంచి అందే సహాయంతో పాటు దక్షిణాదికి రాజకీయ ప్రాతినిధ్యం పూర్తిగా తగ్గిపోతుంది. భారతదేశ అభివృద్ధికి సహకరించిన దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గడం అన్యాయం. జనాభా నియంత్రణ కోసం పాటుపడిన రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది.
భారతదేశ చరిత్రలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అత్యంత కీలకమైనవి. ఈ అంశం పైన అందరము గట్టిగా కొట్లాడాలి.. వ్యతిరేకించాలి లేకుంటే భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించవు. ఇప్పుడు మౌనంగా ఉంటే చరిత్ర మనల్ని క్షమించదు. అత్యంత కీలకమైన ఈ సందర్భంలో అందరూ కలిసి ఐక్యంగా ముందుకు నడవాలి. భవిష్యత్తు రాజకీయాలను సమూలంగా మార్చేటువంటి ఈ పరిణామం పైన అందరూ మాట్లాడాలి” అని కేటీఆర్ అన్నారు.