TG | నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటిఆర్ పర్యటన

హైదరాబాద్ – : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు.

హైదరాబాద్‌ నుంచి బయలు దేరి మధ్యాహ్నం 12 గంటలకు తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చేరుకుంటారు. అక్రమ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన రైతు అబ్బాడి రాజిరెడ్డిని పరామర్శిస్తారు. 12.30 గంటలకు అంకుసాపూర్‌లో విలేకరి దినేశ్‌ వివాహ కార్యక్రమానికి హాజరవుతారు. మధ్యాహ్నం 1.30 గంటలకు సిరిసిల్ల పట్టణంలోని సాయిమణికంఠ గార్డెన్‌లో బీఆర్‌ఎస్‌ నాయకుడు కుంబాల మల్లారెడ్డి కూతురు వివాహానికి హాజరవుతారు.

ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు మాజీ కౌన్సిలర్‌ బుర్ర శంకరయ్య, కాసర్ల మల్లేశం కుటుంబాలను పరామర్శించి ఎల్లారెడ్డిపేట మండలానికి చేరుకుంటారు.

మధ్యాహ్నం 3 గంటలకు నీళ్లులేక ఎండుతున్న పంటలను పరిశీలిస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు ముస్తాబాద్‌ మండలం గూడెం గ్రామంలో జరిగే రెండు వివాహాలకు హాజరై 4.30కి పోతుగల్‌కు చేరుకుంటారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు జెల్ల దేవయ్య కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత తిరిగి హైదరాబాద్‌కు వెళ్తారు.

Leave a Reply