హైదరాబాద్, ఆంధ్రప్రభ : మెట్రో విషయమై సీఎం రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. మెట్రో డీపీఆర్ ను గత వారమే కేంద్రానికి అందిందని, అయితే మెట్రో రైలు సాధ్యసాధ్యాలపై కేంద్రం పరిశీలిస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కోసమో, సీఎం రేవంత్ రెడ్డి కోసమో పనిచేయడం లేదని, తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఏకగ్రీవం కావాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఆదివారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని, రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నిక ఏకగ్రీవం కావాలని కోరుకుంటున్నానని కిషన్రెడ్డి చెప్పారు. దీనికి సంబంధించి సాయంత్రం నోటిఫికేషన్, రేపు నామినేషన్, ఎల్లుండి ఎన్నిక ఉంటుంది అని తెలిపారు.
బీసీ నినాదం..
రాష్ట్రంలో బీసీ నినాదాన్ని ఎత్తుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుందని బీజేపీ నాయకులు భావిస్తున్నట్లు తెలిసింది. ఈ సారి బీజేపీ అధ్యక్షుడి పదవి బీసీలకు దక్కే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. కాగా, కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్లు ప్రధాన పోటీదారులుగా ఉన్నట్లు సమాచారం. మహిళల్లో ఎంపీ డీకే అరుణ పేరు కూడా వినిపిస్తున్నది. ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి.