హైదరాబాద్ – దేశాన్ని రక్షించడంలో హైదరాబాద్ అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో నేషనల్ సైన్స్ డే ఎగ్జిబిషన్ కేంద్ర మంత్రి రాజేంద్రనాథ్ తో కలసి ఆయన ప్రారంభించారు.. డీఆర్డీవో, డిఫెన్స్, ఏరోస్పేస్ ఉత్పత్తులకు చెందిన 200 స్టాల్స్ ప్రదర్శించారు. డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలో భారత సామర్థ్యాలను ప్రదర్శించేలా స్టాల్స్ ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు నేషనల్ సైన్స్ డే ఎగ్జిబిషన్ జరగనుంది.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, ఈ దేశ రక్షణ బాధ్యత యువతీ యువకులపై ఉందని చెప్పారు. బీడీఎల్, డీఆర్డీఓ, మిదానీ, హెచ్ఏఎల్ వంటి దేశ రక్షణ కోసం రాకెట్లు, మిస్సైల్స్ తయారు చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి హైదరాబాద్ నగరం, హైదరాబాద్ చుట్టూ పరిశ్రమలు ఉన్నాయన్నారు. లక్షలాది మంది విద్యార్థులకు దేశభక్తి , దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యతపై వారిలో స్ఫూర్తిని, అవగాహన కల్పించడానికి ఈ ప్రత్యేకమైన ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసుకున్నామని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి ఏటా లక్షకుపైగా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు, ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ చదివి, అమెరికాకు వెళ్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. వారిలో దేశభక్తితో, దేశ రక్షణ ప్రాధాన్యతనలు వివరించడానికి ఈ వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నామని అన్నారు. తెలంగాణ నుంచి కేవలం ఐటీ ప్రొఫెషనల్స్ మాత్రమే అమెరికాకు వెళ్లకుండా, దేశ రక్షణ రంగానికి అవసరమైన సమర్థవంతమైన ఇంజినీర్లు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
దేశ రక్షణ కోసం అవసరమైన ఇంజినీర్లను తయారుచేయడం మరింత ముఖ్యమని తెలిపారు. స్వాతంత్ర్యానికి ముందు, ఆ తర్వాత కూడా హైదరాబాద్లో బీడీఎల్, హెచ్ఎచ్ఎల్, మిదాని, డీఆర్డీఓ వంటి అనేక సంస్థలు దేశ రక్షణ కోసం ఉత్పత్తి రంగంలో విశేషంగా పని చేస్తున్నాయని తెలిపారు. దేశ రక్షణ రంగానికి హైదరాబాద్, బెంగళూరు ముఖ్య కేంద్రాలుగా ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. గతంలో మీతో చర్చించినట్లుగా హైదరాబాద్-బెంగళూరు డిఫెన్స్ ఇండస్ట్రీయల్ కారిడార్గా ప్రకటించాలని, తద్వారా భారీగా పెట్టుబడులు వస్తాయని అన్నారు. రాకెట్ తయారీ సహా ఆకాశ మార్గం (స్కై రూట్) వంటి స్టార్టప్లు అభివృద్ధి చెందుతాయని, అందుకోసం కేంద్ర ప్రభుత్వ సహకారం, మద్దతు అవసరమని తెలిపారు. రక్షణ రంగంలో భారతదేశాన్ని నంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లేందుకు తాము ప్రయత్నిస్తామని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.