TG | ప్ర‌శ్నిస్తే… ఆంక్ష‌లా – రేవంత్ నిల‌దీసిన హ‌రీశ్ రావు

హైద‌రాబాద్ – ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు విధించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి నిత్యకృత్యంగా మారిందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో ఇచ్చారు. నేడు లైబ్రరీల్లో విద్యార్థులపై ఆంక్షలు విధిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య పాలన అనే ఏడో గ్యారంటీని మరచి ఎమర్జెన్సీ రోజులను తిరిగి తెస్తున్నారని మండిపడ్డారు. ఈ మేర‌కు ఎక్స్ ఖాతాలో ట్విట్ చేశారు..

గ్రంథాలయాలను రాజకీయ వేదికలుగా మార్చిన దుర్మార్గ చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని హరీశ్‌రావు విమర్శించారు. ఇప్పుడు సుద్దపూస మాటలు, నీతులతో బోర్డులు పెట్టినంత మాత్రాన పాపపరిహారం కాదని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ రాజకీయం అంతా లైబ్రరీల చుట్టే జరిగిందని తెలిపారు. రాహుల్ గాంధీని సైతం లైబ్రరీకి తీసుకొచ్చి బూటకపు హామీలు ఇచ్చిన సంగతి మరిచిపోయారా అని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే అవి రాజకీయ వేదికలు కావు, గ్రంథాలయాలు అని గుర్తు వచ్చాయా అని నిలదీశారు.

గ్రంథాలయాల్లో పోలీసు లాఠీ చార్జీలు జరిపించిన అరాచక చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది అని హరీశ్‌రావు మండిపడ్డారు. విద్యార్థులు, నిరుద్యోగుల వీపులు పగుల గొట్టిన అమానుష పాలన కాంగ్రెస్ ప్రభుత్వానిదని అన్నారు. జాబ్ క్యాలెండర్ ఏమైందని మీ నాయకుడిని విద్యార్థులు నిలదీసినందుకు, ఈరోజు గ్రంథాలయాల్లో నిషేధాజ్ఞలు ఏర్పాటు చేస్తారా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒక విధంగా, అధికారం పక్షంలోకి రాగానే మరొక విధంగా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. ఒక్క విద్యార్థులే కాదు, యావత్ తెలంగాణ మీరు ఇచ్చిన మోసపూరిత హామీల గురించి నిలదీస్తున్నదని తెలిపారు. మొత్తం తెలంగాణ సమాజం మీద నిషేధాజ్ఞలు విధిస్తారా అని ప్రశ్నించారు.

Leave a Reply