TG | ఉగ్రవాద నిర్మూలనకు పూర్తి మద్దతు : సీఎం రేవంత్ !

హైదరాబాద్: భారత సాయుధ దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్‌‌’కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి మద్దతు ప్ర‌క‌టించారు. ఈ నేపథ్యంలో సైన్యానికి సంఘీభావంగా నేడు (గురువారం) హైదరాబాద్‌లో ర్యాలీ నిర్వహించారు.

భారత సైన్యానికి సంఘీభావంగా రాష్ట్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం 6 గంటలకు సెక్రటేరియట్ నుండి నెక్లెస్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించింది. కాగా, ఈ ర్యాలీలో సీఎం రేవంత్ తన భుజాన జాతీయ జెండా వేసుకొని పాల్గొనడం విశేషం.

ఈ ర్యాలీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, సీనియర్ అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అలాగే, ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో యువత పాల్గొని భారత సైనిక దళాలకు సంఘీభావం తెలిపారు. ర్యాలీ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని అక్కడి నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు కొనసాగింది.

ఈ సంర్భంగా ఉగ్రవాద దాడిలో అమరులైన సైనికులకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులు నివాళులర్పించారు. అనంతరం ఒక నిమిషం మౌనం పాటించారు.

ఆపరేషన్ సింధూర్‌‌తో గుణపాఠం..

ఈ సంద‌ర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్.. ఈ సమయంలో ప్రతి పౌరుడు భారత సైనికులకు అండగా నిలబడాలని కోరారు. మనమందరం ఒకే గొంతుకై, ఒకే స్వరంతో గళం వినిపిద్దామని సీఎం వ్యాఖ్యానించారు. పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై సైన్యం చేసిన దాడులు మనల్ని గర్వపడేలా చేశాయని పేర్కొన్నారు.

మన ఆడబిడ్డల నుదిటి సింధూరాన్ని తుడిచిన ఉగ్రవాదులకు భారత సైన్యం ఆపరేషన్ సింధూర్‌‌తో గట్టి గుణపాఠం చెప్పిందన్నారు. మన‌ శాంతి స్వరూపాన్ని చేతగానితనంగా భావించి… దాడుల‌కు పాల్పడితే, దాడి చేసిన వారికి భూమి మీద నూకలు ఉండవని స్పష్టం చేశారు.

మన దేశ సమగ్రతను సవాలు చేసే వారు భారీ మూల్యం చెల్లించుకుంటారని.. భార‌త్ త‌లుచుకుంటే… ప్రపంచ పటం నుండి పాకిస్తాన్‌ను తుడిచిపెట్టగలదని సీఎం రేవంత్ హెచ్చరించారు.

ఎన్నికలు ఉన్నప్పుడు రాజకీయాలు వేరే విషయం.. కానీ ఉగ్రవాదంపై పోరాటంలో దేశం ఐక్యంగా ఉండాల‌న్నారు. రాహుల్ గాంధీ స్వయంగా ప్రధాని మోడీని కలిసి, “ఉగ్రవాదులపై చర్య తీసుకోండి, మీకు మా మద్దతు ఉంటుంది” అని అన్నట్టు సీఎం రేవంత్ తెలిపారు.

కాగా, భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్‌ సూచించారు. అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Leave a Reply