మారుతున్న కాలానికి అనుగుణంగా తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో అందించే కోర్సుల్లో మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైస్ ఛాన్సలర్లకు సూచించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులను బోధించాల్సిన అవసరం ఉందని, విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా విశ్వవిద్యాలయాలు పనిచేయాలని ఆయన అన్నారు.
విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. గ్రామీణ ప్రాంతాలు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుండి విద్యార్థులు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు వస్తున్నారని, వారి భవిష్యత్తును తీర్చిదిద్దే బోధనకు వర్సిటీలు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం అన్నారు.
ఆర్థికంగా స్థోమత ఉన్న కుటుంబాల పిల్లలు మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులను ఎంచుకుని ప్రైవేట్ విశ్వవిద్యాలయాల వైపు మొగ్గు చూపుతున్నారని, వారితో ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు పోటీని ఎదుర్కోవాలంటే, డిమాండ్ ఉన్న కోర్సులను బోధించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
గతంలో నియమితులైన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ఫ్రొఫెసర్లు ఉన్నారన్న భావనతో పలు విశ్వవిద్యాలయాల్లో పెద్దగా ప్రాధాన్యం లేని కోర్సులను బోధిస్తున్నారని, వాటిని రద్దు చేసి నూతన కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించారు. వర్సిటీలు కొందరు ప్రొఫెసర్లకు రిహాబిలిటేషన్ సెంటర్లుగా మారొద్దని, అలాంటి వారికి అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతలు అప్పగించాలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ్యాల్లో ప్రొఫెసర్ల కొరత, భవనాల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలను వీసీలు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు.
వర్సిటీలను తీర్చిదిద్దడానికి అవసరమైన నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. విశ్వవిద్యాలయాల ఉమ్మడి సమస్యలు, అలాగే వర్సిటీల వారిగా ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావుతో సమావేశమై చర్చించాలని, ఆయా అంశాలపై ప్రభుత్వానికి సమగ్రమైన నివేదిక సమర్పించాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ సూచించారు.
చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం లోగోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం లోగోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణలోని విశ్వవిద్యాలయాల వైస్-ఛాన్సలర్ల సమావేశం అనంతరం ముఖ్యమంత్రి ఈ లోగోను ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో కేశవరావుతో పాటు సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి, విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి, యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు ప్రొ.కుమార్ మొలుగారం, ప్రొ. కె.పత్రాప్ రెడ్డి, డాక్టర్ టి.యాదగిరిరావు, ప్రొ. ఖాజా అల్తాఫ్ హుస్సేన్, ప్రొ. జీఎన్. శ్రీనివాస్, ప్రొ. ఉమేష్ కుమార్, ప్రొ. సూర్య ధనంజయ్, ప్రొ. కిషన్ కుమార్ రెడ్డి, ప్రొ. టి.గంగాధర్, ప్రొ. ఏ.గోవర్ధన్, ప్రొ. వి.నిత్యానందరావు, ప్రొ. ఘంటా చక్రపాణి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.