ఉద్యోగులకు డీఏలు ఇవ్వరు
ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు పెంచరా?
డ్రైవర్లు, వర్క్ ఇన్ స్పెక్టర్లకు 25 శాతానికిపైగా వేతనాలు తగ్గించడం దుర్మార్గం?
ఔట్ సోర్సింగ్ సిబ్బందికి తక్షణం వేతనాలను పెంచండి
సీఎం రేవంత్ను కోరిన కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్ శానిటేషన్ ఉద్యోగుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. పట్టణాల పరిశుభ్రతలో శానిటేషన్ సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని, కరోనా మహమ్మారి కాలంలో ప్రాణాలను ఫణంగా పెట్టి అందించిన సేవలు మరువలేనివని, అలాంటి కార్మికులకు వేతనాలు తగ్గిస్తూ జీవో జారీ చేయడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆనాటి నుండి నేటి వరకు వేతనాలు పెంచాలని కోరుతున్నా పట్టించుకోకుండా, మున్సిపల్ డ్రైవర్లు, వర్క్ ఇన్సెక్టర్లకు చెల్లిస్తున్న వేతనాలను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. బీజేపీ పక్షాన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామన్నారు. ప్రతి ఏటా పెరిగే నిత్యావసర ధరలు, ఇతర ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగుల జీత భత్యాలను పెంచడం పరిపాటని పేర్కొన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు పెంచకపోగా ఉన్న వేతనాల్లో భారీగా కోత విధించడం ఎంత వరకు సమంజసం ప్రశ్నించారు.
రూ.22000 నుంచి రూ.16600 తగ్గింపు
ఇప్పటి వరకు శానిటరీ ఇన్ స్పెక్టర్లకు నెల వేతనం రూ.22 వేలు చెల్లిస్తుండగా, ఆ వేతనాన్ని రూ.16,600లకు తగ్గించారని కేంద్ర మంత్రి అన్నారు. డ్రైవర్లకు సైతం ఇదే విధంగా కోత విధించడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో 30 వేల 955 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారని, 2021 జూన్ 11న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ 30 శాతం మేరకు వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారని, నాటి నుండి నేటి వరకు అంటే గత నాలుగేళ్లుగా వేతనాల పెంపు ఊసే లేదని పేర్కొన్నారు. పైగా దాదాపు మూడు వేల మంది శానిటరీ ఇన్ స్పెక్టర్లు, డ్రైవర్ల వేతనాల్లో ఏకంగా 25 శాతానికిపైగా కోత విధించడం కాంగ్రెస్ ప్రభుత్వ మతిలేని చర్యగా భావిస్తున్నామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి అందుకు భిన్నంగా వ్యవహరించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
ఉద్యోగులకు ఐదు డీఏలు పెండింగ్
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఐదు డీఏలు పెండింగ్ లో ఉన్నప్పటికీ వాటిని చెల్లించడం లేదని బండి సంజయ్ అన్నారు. జీపీఎఫ్ లో దాచుకున్న సొమ్మును కూడా డ్రా చేసుకోకుండా ఇబ్బంది పెడుతున్నానపి. ఆఖరికి రిటైర్డ్ మెంట్ బెన్ ఫిట్స్ ఇవ్వకుండా తిప్పుతున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పినా తీరు మారకపోవడం బాధాకరమన్నారు. మున్సిపాలిటీల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్ శానిటరీ ఇన్ స్పెక్టర్లు, డ్రైవర్ల వేతనాల్లో భారీగా కోత విధించడాన్ని చూస్తుంటే ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిపట్ల కాంగ్రెస్ కు ఉన్న వ్యతిరేక భావం అర్ధమవుతోందన్నారు.