TG | రేషన్ బియ్యం వద్దని మోడీకి లేఖ రాసే దమ్ముందా : రేవంత్ ను ప్రశ్నించిన బండి

కరీంనగర్ :రేషన్ షాపుల ద్వారా పేదలకు బియ్యం మేమే ఇస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెప్పడం విడ్డూరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ‘‘నేను అడుగుతున్నా…మీరు పేదలకు ఇచ్చే బియ్యం విషయంలో కిలోకు రూ.10లు మాత్రమే ఖర్చు చేస్తున్నారు. కానీ మోదీ ప్రభుత్వం కిలోకు రూ.37లు ఖర్చు చేస్తోంది. ఇందులో ఎవరు గొప్ప?’’అని ప్రశ్నించారు. నరేంద్ర మోదీ ఇస్తున్న పైసలతో ఇంతకాలం మంచి బియ్యం ఇవ్వకుండా ప్రజలను ఇబ్బంది పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సన్న బియ్యం ఇస్తూ… మొత్తం ఖర్చంతా మాదేనని కాంగ్రెస్ చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ‘

‘మీరు చెబుతున్నదే నిజమైతే రేషన్ బియ్యం కోసం కేంద్రం ఇస్తున్న పైసలు మాకు అక్కర్లేదు. మేమే కిలోకు రూ.50లు ఖర్చు పెట్టి పేదలకు సన్నబియ్యం అందిస్తామని కేంద్రానికి లేఖ రాసే దమ్ముందా?’’అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.

‘‘మేం అడుగుతున్నదేంది? రేషన్ షాపులవద్ద ప్రధాని ఫోటో పెట్టాలని కోరుతున్నాం. పేదలకు అందిస్తున్న బియ్యంలో కేంద్రం వాటా ఉందని చెప్పమంటున్నాం. ఇదేమైనా తప్పా?’’అని ప్రశ్నించారు.

బీజేపీ చేపట్టిన ‘గావ్ చలో’ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు ఉదయం కరీంనగర్ రూరల్ మండలంలోని జూబ్లినగర్ లో పర్యటించారు. ఊరంతా తిరిగి కేంద్ర సంక్షేమ పథకాలను వివరించారు. స్థానికులతో సమావేశమై కేంద్ర పథకాల అమలు, గ్రామ సమస్యలపై ఆరా తీశారు. గ్రామంలోని 84వ బూత్ లో స్థానికులను ఉద్దేశించి మాట్లాడారు. పచ్చదనాన్ని కాపాడాలంటూ మొక్కలు నాటారు. అంతకుముందు కేంద్ర సంక్షేమ పథకాల లబ్దిదారులతో సమావేశం నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుల గంగాడి క్రిష్ణారెడ్డి, స్థానిక బీజేపీ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా లబ్దిదారులను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడారు. ఏమన్నారంటే….ప్రియతమ ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివ్రుద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. 80 కోట్ల మంది పేదలకు ఉచిత బియ్యం ఇచ్చినం. 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుండి బయటపడేసినం. 4 కోట్ల పేదలకు ఇండ్లను నిర్మించినం. మరో 3 కోట్ల ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినం. 30 కోట్ల టాయిలెట్లు నిర్మించినం. 12 కోట్ల ఉజ్వల కనెక్షన్లు ఇచ్చినం.బాధాకరమైన విషయం ఏందంటే నరేంద్రమోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా పేదలకు 4 కోట్ల ఇండ్లను నిర్మించింది. మరో 3 కోట్ల ఇండ్లను నిర్మించేందుకు సిద్ధమైంది. కానీ తెలంగాణలో మాత్రం ఇక్కడి పాలకులు 11 ఏళ్లుగా పేదలకు ఇండ్లను ఇవ్వకుండా వాళ్లకు గూడు లేకుండా చేస్తున్నారు. గతంలో కేంద్రం ఇండ్లను మంజూరు చేసినా కేసీఆర్ ప్రభుత్వం ఒక్క ఇల్లు కట్టలే. ఇప్పుడున్న ప్రభుత్వం ఏడాదిన్నరగా పేదలకు ఒక్క ఇల్లు కూడా కట్టియ్యకుండా పేదలకు గూడు లేకుండా చేస్తోంది.

కేసీఆర్ పాలనలో కేంద్రం 2.4 లక్షల ఇండ్లను మంజూరు చేస్తే ఒక్క ఇల్లు కట్టలే. అవి పూర్తి చేస్తే మరో 5 లక్షల ఇండ్లను మంజూరు చేయిస్తామని మొత్తుకున్నా పట్టించుకోలే. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏడాదిన్నరగా ఒక్క ఇల్లు కూడా కట్టకుండా పేదలకు అన్యాయం చేస్తోంది.

ఆరోగ్యశ్రీ కార్డుతో తెలంగాణలోని ఆసుపత్రుల్లో మాత్రమే ఉచితంగా చికిత్స చేసుకోవచ్చు. కానీ ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో ఆ చికిత్సలు కూడా చేయడానికి ప్రైవేట్ ఆసుపత్రులు ముందుకు రావడం లేదు… కానీ మోదీ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కార్డులిచ్చింది. ఈ కార్డు చూపిస్తే దేశంలో ఏ ఆసుపత్రిలోనైనా రూ.5 లక్షల దాకా ఉచితంగా ట్రీట్ మెంట్ చేసుకోవచ్చు. కానీ ఈ పథకాన్ని పూర్తిగా అమలు చేయకుండా పేదలకు వైద్యం అందకుండా చేస్తున్నారు.

పాలనలో రేవంత్ రెడ్డి సర్కార్ కేసీఆర్ పాలనను మించిపోతోంది. ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. 6 గ్యారంటీల ఊసే లేదు. మహిళలకు రూ.2500లు, తులం బంగారం, స్కూటీ ఇస్తానని మాట తప్పారు. రైతులకు, నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యార్థులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదు. ఇదేందని అడిగితే అప్పులైనయ్… ఎవరూ నమ్మడం లేదని బుకాయిస్తున్నడు. అప్పులైన సంగతి ఎన్నికలకు ముందు తెలియదా? తెలిసి కూడా హామీలిచ్చి ప్రజలను మోసం చేశారు.గ్రామాల్లో జరుగుతున్న అభివ్రుద్ధి అంతా కేంద్ర నిధులతోనే జరుగుతోంది. స్మశాన వాటికలు, రైతు భరోసా కేంద్రాలు, వీధి దీపాలు సహా చివరకు మొక్కలు నాటేందుకు అయ్యే పైసలన్నీ కూడా మోదీ ప్రభుత్వమే ఇస్తోంది. కాబట్టి దయచేసి మోదీని మరువొద్దు…అని బండి సంజయ్ అన్నారు.

అంబేద్కర్ దేహాన్ని తరలించేందుకు పైసలడిగిన నీచ చరిత్ర కాంగ్రెస్ దే

అణగారిన వర్గాల్లో వెలుగులు నింపడంతోపాటు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఫరిఢవిల్లేలా రాజ్యాంగాన్ని రచించిన భారత అంబేద్కర్ ను అడుగడుగున అవమానించిన చమైన చరిత్ర కాంగ్రెస్ దేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. అంబేద్కర్ అంత్యక్రియలు ఢిల్లీలో జరగనీయకుండా ముంబయికి తరలించిన కాంగ్రెస్ పార్టీ… ఆ తరలింపుకయ్యే విమాన ఛార్జీలు చెల్లించాలంటూ అంబేద్కర్ సతీమణికి బిల్లులు పంపిన నీచాతినీచమైన చరిత్ర కాంగ్రెస్ దేనని విమర్శించారు.

అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియం వద్దకు వచ్చారు. అంబేద్కర్ చిత్రపటాలు, కాషాయ జెండాలతో కార్యకర్తలు నిర్వహించిన బైక్ ర్యాలీలో బండి సంజయ్ పాల్గొన్నారు. స్వయంగా బైక్ నడుపుతూ అంబేద్కర్ స్టేడియం, కోతిరాంపూర్, కమాన్ చౌరస్తా, వన్ టౌన్ పోలీస్ స్టేషన్, గీతాభవన్, సర్క్యూట్ గెస్ట్ హౌజ్ మీదుగా కోర్టు చౌరస్తాకు చేరుకున్నారు.

అనంతరం అక్కడ బీజేపీ నాయకులతో కలిసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మంచి నీళ్లతో శుద్ధి చేశారు. జై భీమ్… జై బీజేపీ అంటూ నినాదాలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఏమన్నారంటే….దేశవ్యాప్తంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా అంబేద్కర్ విగ్రహాలను శుద్ది చేయడమే అంబేద్కర్ గొప్ప చరిత్రను భావితరాలకు తెలియజేయడమే. మనలోని అజ్ఝానాన్ని పారదోలి వెలుగులు నింపుకునేలా చేయడమే. ఆయన ఆశయాలను కొనసాగించడమే. అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు అంబేద్కర్. అంటరానితనాన్ని పాతాళానికి తొక్కి కుల రక్కసిని కూకటివేళ్లతో పెకలించేందుకు తన జీవిత సర్వస్వాన్ని ధారపోసిన మేధావి. భారత ప్రజాస్వామ్యానికి దిక్సూచి. అణగారినవర్గాల ఆత్మగౌరవ పతాకం అంబేద్కర్. అతిపేద దళిత కుటుంబంలో పుట్టి తిండి కోసం అనేక తిప్పలు పడ్డ వ్యక్తి. ఎంత ఆకలి వేసినా ఒక్క పూటే భోజనం తింటూ చదువుకున్న మహనీయుడు.స్కూల్లో చదవనీయకుండా వెలివేసినా చదువును ఆపలేదు.. ఉన్నత చదువు కోసం 10 ఏళ్ల జీవితాన్నే బరోడా మహారాజు దగ్గర ఫణంగా పెట్టిన గొప్ప నాయకుడు.శ్యామాప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఆలోచనా విధానాన్ని బలపర్చిన వ్యక్తి అంబేద్కర్. దేశ విభజనను, జమ్మూకాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని వ్యతిరేకించారు.

అంబేద్కర్ ఆశయాల సాధనకు బీజేపీ తూ.చ తప్పకుండా క్రుషి చేస్తున్న ప్రభుత్వం నరేంద్రమోదీదే… భావితరాలకు అంబేద్కర్ చరిత్ర తెలిసేలా పంచ తీర్థాలను ఏర్పాటు చేసింది. దళితుడైన రామ్ నాథ్ కోవింద్, ఆదివాసీ ముర్ముకు రాష్ట్రపతి పదవితో గౌరవించింది. 12 మంది దళితులకు, 27 మంది ఓబీసీలకు, 8 మంది మహిళలకు కేబినెట్ లో చోటు కల్పించింది. NCBC (జాతీయ బీసీ కమిషన్) కు రాజ్యాంగ బద్ధత కల్పించింది. ఏటా 1.25 లక్షల మంది దళితులను పారిశ్రామికవేత్తలుగా మారుస్తోంది.బీజేపీ క్రుషితోనే అంబేద్కర్ కు భారతరత్న అవార్డుతో గౌరవమిచ్చింది. అంబేద్కర్ స్మారక స్టాంపు, బిల్లుల విడుదల. పార్లమెంటులో అంబేద్కర్ చిత్రపటం, సుప్రీంకోర్టు, న్యాయమంత్రిత్వ శాఖలో విగ్రహాల ఏర్పాటు చేసిన ఘనత బీజేపీదే.

2023లో నారీ శక్తి వందన్ బిల్లు (33% రిజర్వేషన్లు) ప్రవేశపెట్టడం… ఆర్టికల్ 370 రద్దు చేయడం బీజేపీ ఘనతే. కానీ అంబేద్కర్ ను కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అవమానించింది. 1951లో హిందూకోడ్ బిల్లు, సామాజిక న్యాయ సాధికారత అంశాలపై అంబేద్కర్ అభిప్రాయాలను నెహ్రూ వ్యతిరేకిస్తే మనస్తాపానికి గురై న్యాయ శాఖ మంత్రి పదవికి అంబేద్కర్ రాజీనామా చేశారు. ఆ తరువాత 1952 ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి, 1954 ఉప ఎన్నికల్లో స్వయంగా అభ్యర్థిని నిలబెట్టి అంబేద్కర్ ను ఓడించిన నీచమైన చరిత్ర కాంగ్రెస్ దే. అంతేగాకుండా అంబేద్కర్‌ను చరిత్రను తగ్గించే కుట్ర చేసింది. భారతరత్న ఇవ్వకుండా అవమానించింది. అంబేద్కర్‌ను ఓడించినోళ్లకు పద్మభూషణ్ ఇచ్చింది. ఆఖరికి అంబేద్కర్ అంత్యక్రియలు ఢిల్లీలో జరగనీయకుండా ముంబయికి తరలిస్తే…విమాన చార్జీలను చెల్లించాల్సిందిగా అంబేద్కర్ భార్యకు రశీదు పంపిన నీచాతినీచమైన చరిత్ర కాంగ్రెస్ దే. అంటూ మండి పడ్డారు బండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *