TG | దివ్యాంగుడికి అండగా ప్రజా ప్రభుత్వం

TG | దివ్యాంగుడికి అండగా ప్రజా ప్రభుత్వం
- భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
- దివ్యాంగులకు ఎలక్ట్రికల్ స్కూటీలు, విద్యార్థులకు ల్యాప్ టాప్ ల పంపిణీ
TG | ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : అర్హులైన ప్రతి ఒక్క దివ్యాంగుడికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈ రోజు భూపాలపల్లి మంజూరునగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన అర్హులైన దివ్యాంగులకు ఎలక్ట్రికల్ స్కూటీలు, విద్యార్థులకు ల్యాప్ టాప్ లను జిల్లా సంక్షేమ శాఖ అధికారి మల్లీశ్వరి తో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరాలనే లక్ష్యంతో పనిచేస్తోందన్నారు.
ముఖ్యంగా దివ్యాంగుల సంక్షేమానికి ప్రజాప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి దివ్యాంగుడికి ప్రభుత్వ పథకాలు, పెన్షన్లు, వైద్య సదుపాయాలు, ఉపాధి అవకాశాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దివ్యాంగులు స్వావలంబనతో గౌరవంగా జీవించేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. దివ్యాంగుల సమస్యలను స్థానిక స్థాయిలోనే పరిష్కరించేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అర్హత కలిగిన ఎవరికీ అన్యాయం జరగకుండా ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
- యాదవకాలనీలో కొత్త విద్యుత్ లైన్లను ప్రారంభించిన ఎమ్మెల్యే
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని యాదవకాలనీ 5వ వార్డు లో కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుత్ లైన్లను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్విచ్చాన్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి , నాయకులు అప్పం కిషన్ , తాళ్ళపల్లి భాస్కర్ రావు , ఉడుత సరోజన రాయమల్లు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
