తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ (Distributor Sunil Narang) ఎన్నికయ్యారు. జూన్ 7న హైదరాబాద్లో తెలంగాణ ఫిలిం చాంబర్ జనరల్ బాడీ సమావేశం (Telangana Film Chamber General Body Meeting) జరిగింది. ఈ సమావేశంలో ఫిలిం చాంబర్కు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
అధ్యక్షుడు, ఉపాధ్యక్షులను ఎన్నుకున్నారు. వైస్ ప్రెసిడెంట్స్గా రవీంద్ర గోపాల్ (Ravindra Gopal) , కే. ఉదయ్ కుమార్ రెడ్డి (K. Uday Kumar Reddy) ఇద్దరు ఎన్నికయ్యారు. సెక్రటరీగా శ్రీధర్ వీఎల్, జాయింట్ సెక్రటరీగా చంద్ర శేఖర్ రావు.జే ఎంపికయ్యారు. బీ.సత్యన్నారాయణ గౌడ్ను ట్రెజరర్ ఎన్నుకున్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా 14 మంది ఎన్నికయ్యారు.
తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సునీల్ నారంగ్ మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ సినిమాను ఆపే దమ్ము ఎవరికీ లేదని అన్నారు. సినీ సమస్యలపై ఒక కమిటీ వేశామని.. కమిటీ రిపోర్టు ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఇండస్ట్రీలో ఆ నలుగురు అనేది ఇపుడు లేదని.. అది 10 సంవత్సరాల క్రితం ఉండేదన్నారు. సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా మంది యాక్టివ్గా ఉన్నారని చెప్పారు.
సెక్రటరీ శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ.. 2016 నుంచి మేము పర్సంటేజ్ గురించి పోరాడుతున్నామని పేర్కొన్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ బంద్ అని మేం ఎప్పుడు చెప్పలేదని, పవన్ కళ్యాణ్ సినిమా కోసం థియేటర్స్ అన్ని ఖాళీగా ఉంచామని తెలిపారు.
జనవరి నుంచి ఇప్పటి వరకు కేవలం 3 సినిమాలే హిట్ అయ్యాయని.. ఇలావుంటే మా పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. హీరోలు రెండు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తుంటే థియేటర్స్ ఎలా నడుస్తాయని ప్రశ్నించారు. హీరోలు ఎక్కువ సినిమాలు చెయ్యాలని కోరారు.