Tandur | జోరుగా ఇసుక అక్రమ రవాణా …

Tandur | జోరుగా ఇసుక అక్రమ రవాణా …

  • బిజ్వార్‌, బొంకూరు కాగ్నానది నుంచి రాత్రిళ్లు రవాణా
  • పెద్దేముల్‌ మండలం రుక్మాపూర్ నుంచి రవాణా
  • మామూళ్ల మత్తులో పోలీసులు, టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు
  • పట్టించుకోని రెవెన్యూ, మైన్స్‌, రవాణా శాఖ అధికారులు
  • కలెక్టర్‌ ఆదేశాలను పట్టించుకోని అధికారులు

తాండూరు రూరల్‌, (ఆంధ్రప్రభ) : తాండూరు మండలంలోని బిజ్వార్‌ గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామం బొంకూరు గ్రామ శివారులో నుంచి ప్రవహించే కాగ్నానది పరివాహాక ప్రాంతాల్లోని పొలాలకు ఆనుకుని ఉన్న నదిలో పెద్ద ఎత్తున ఇసుక చేరింది. భారీ వర్షాల కారణంగా బొంకూరు బిజ్వార్‌ గ్రామాల కాగ్నానది ఉదృతంగా ప్రవహించడంతో గ్రామాల మద్య రాకపోకలు నిలిచిపోయాయి.

బొంకూరు గ్రామం నుంచి రుక్మాపూర్‌, మంబాపూర్‌ మీదుగా తాండూరుకు పనులు నిమిత్తం రాకపోకలు సాగిస్తున్నారు. ఈ గ్రామానికి రుక్మాపూర్‌ నుంచి ప్రభుత్వం రోడ్డు వేయించింది. దీంతో రాకపోకలు సక్రమంగా సాగుతున్నాయి. దీంతో ఇసుక మాఫియా కాగ్నానదికి అనుకుని ఉన్న బొంకూరు గ్రామానికి చెందిన సూరప్ప అనే రైతుకు చెందిన భూముల్లో నుంచి రోడ్డు వేసుకున్నారు.

నిత్యం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6గంటల వరకు ఇసుక రవాణా సాగుతోంది. అక్రమ దందాకు రెండు పార్టీలకు చెందిన మాజీ ప్రజా ప్రతినిధులతో పాటు నేతలు ఒక్కటయ్యారు. దీంతో ఎవ్వరిపై ఎవరు ఫిర్యా దులు చేసుకోకుండా ఇసుక రవాణా పెద్ద ఎత్తున జరుగుతోంది. రాత్రి వేళల్లో జేసీబీ యంత్రంతో ఇసుక ట్రాక్టర్లలో లోడ్‌ చేస్తూ ఇసుక వ్యాపారులు రవాణా చేస్తున్నారు.

బొంకూరు గ్రామానికి చెందిన కొందరు పెద్దలు అక్రమ ఇసుక అడ్డుకునేందుకు రోడ్డును కూడా తవ్వేశారు. అంతలోనే ఇసుక వ్యాపారుల నేతలు వారికి నచ్చజెప్పి మళ్లి ప్రారంభించారు. నదిలో దాదాపు 2,3ఎకరాల చొప్పున ఇసుక పెద్ద ఎత్తున ఓ గుట్టలాగా నిలిచి పోయింది. ఇసుక దిబ్బ పక్కనుంచి నీరు ప్రవహించేందుకు సులువుగా మారడంతో ఇసుక ఒకేచోట నిలిచిపోయింది.

భారీ వర్షాల వల్ల పక్కనున్న పొలాల్లో కూడా ఇసుక మేటలతో నిండిపోయింది. బొంకూరు రామస్వామి దేవాలయం ముందు నుంచి ఇసుక రవాణాకు పొలాల ద్వారా రోడ్డు వేసుకున్నారు. రెండు పార్టీలకు చెందిన నేతలు ఉండడంతో ఇసుక అక్రమ రవాణా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.

ట్రాక్టర్లు రాకపోకలతో రుక్మాపూర్‌, మంబాపూర్‌ గ్రామాల్లో శబ్దాలకు ప్రజలకు నిద్రలేకుండా పోతున్నామని కొందరు వాపోతున్నారు. ఈ ఇసుక మేటలు ఉన్న ప్రాంతాన్ని పెద్దేముల్‌ మండలంకు చెందిన వారికే తెలుసు కాబట్టి రుక్మా పూర్‌, మంబాపూర్‌, రేగొండి, కొండా పూర్‌ తదితర గ్రామాలకు చెందిన ఇసు క వ్యాపారులు రాత్రి వేళల్లో రవాణా చేస్తున్నారు.

పెద్దేముల్‌ పోలీస్టేషన్‌తో పాటు తాండూరు పోలీస్టేషన్‌ పరిధిలో నుంచి కొనసాగుతున్న విషయం పోలీసులకు సమాచారం ఇచ్చే నడిపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇసుక మాఫీయాలో ఒకరు పోలీసులకు ఇవ్వాల్సిన మామూళ్లు ఎప్పటికప్పుడు అందిస్తుండడంతోనే పెట్రోలింగ్‌ పోలీసులు, టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు కళ్లముందు సాగుతున్న పట్టించు కోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వ ఆధాయానికి పెద్ద ఎత్తున గండి కొట్టి ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న పట్టించుకోవడంలేదు. అక్రమ ఇసుక దందా విషయంలోనే జిల్లా కలెక్టర్‌ ఇందిరమ్మ ఇళ్ల పేరుతో దందా చేస్తున్నారని గత కొన్ని రోజుల నుంచి ఇసుక అనుమతులు నిలిపివేయాలని తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు.

ఇందిరమ్మ ఇళ్లతో పాటు అభివృద్ధి పనులకు రెవెన్యూ అధికారులు అనుమతులు నిలిపివేశారు. కలెక్టర్‌ ఆదేశాలు పాటిస్తున్న తహసీల్దార్లకు ఇసుక రవాణా అక్రమంగా కొనసాగుతున్న ఎందుకు కేసులు పెట్టడం లేదని నిలదీస్తున్నారు. గనుల శాఖ, రవాణా శాఖ ప్రభుత్వ ఆధాయాన్ని కొల్లగొడుతున్న ఇసుక ట్రాక్టర్లపై చర్యలు తీసుకోకపోవడంతో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

పోలీసులు మోటారు వాహనాలకు నెంబర్‌ ప్లేట్లు లేకపోతే కేసులు పెట్టి కోర్టుకు పంపిస్తున్నారని, అదే ఇసుక ట్రాక్టర్లు వందల కొద్దీ నెంబర్లు లేకుండా రోడ్లపై వెళుతుంటే ఎందుకు కేసులు పెట్టడం లేదని, మామూళ్లు తీసుకోవడంతోనే ఇలా వ్యవహరిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు తాండూరు మండలంలోని కరణ్‌ కోట్‌ పోలీస్టేషన్‌ పరిధిలో చంద్రవంచ, చిట్టిగణాపూర్‌, వీర్‌ శెట్టిపల్లి గ్రామాల మీదుగా ప్రవహించే కాగ్నానది నుంచి కూడా రాత్రి వేళల్లోనే ఇసుక పెద్ద ఎత్తున అక్రమ రవాణా చేస్తున్నారు. పోలీసులు ప్రతి గ్రామం మేయిన్‌ గేటు వద్ద సీసీ కెమెరాలు అమర్చినా అక్రమ రవాణా మాత్రం కనిపించడం లేదు. పోలీసులకు సమాచారం ఇచ్చినా ఎవ్వరు కూడా అక్రమ వ్యాపారులపై చర్యలు తీసుకోవడం లేదని పలు గ్రామాలకు చెందిన ప్రజలు పేర్కొంటున్నారు.

Leave a Reply