HYDRAA | సున్నం చెరువు నీటితో ఆరోగ్యానికి కన్నం !

  • నీటి ట్యాంకర్లతో కలుషిత జలాల సరఫరా
  • విద్యార్థుల ప్రాణాలతో వ్యాపారుల చెలగాటం
  • పీసీబీ పరిశోధనలో వెల్లడైన నిజం

మాధాపూర్లోని సున్నం చెరువు చెంత బోర్లు వేసి.. ఆ నీటితో ప్రజల ఆరోగ్యానికి కన్నం పెడుతున్నారు ఇక్కడి నీటి వ్యాపారులు. అక్రమంగా బోర్లు వేసి.. కలుషిత జలాలతో మాధాపూర్ పరిసరాల్లో ఉన్న హాస్ట ళ్ల విద్యార్థుల భవిష్యత్ను అనారోగ్యం పాలు చేస్తున్నారు. ఐఐటీతో పాటు.. వైద్య విద్యనభ్యశించడానికి ఉత్తమ ర్యాంకులు రావాలని ఆశిస్తూ అహర్నిశలూ కష్టపడుతున్న విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. సున్నం చెరువు చెంతకు వెళ్తేనే దుర్వాసన భరించలేం. ఇలాంటి చోట బోర్లు వేసి ఆ నీటిని తాగునీటిగా మాధాపూర్ పరిసరాల్లోని విద్యా సంస్థలు, వసతి గృహాలు, హోటళ్లకు సరఫరా చేసి ప్రాణాలమీదకు తెస్తున్నారు.

పీసీబీ ద్వరా నీటి నాణ్యత పరీక్షలు..

ఈ చెరువును పునరుద్ధరించే క్రమంలో హైడ్రా.. ఇక్కడి భూగర్భ జలాలు ఎంతటి ప్రమాదకర స్థాయిలో ఉన్నాయో అనే అంశాన్ని పీసీబీ (పొల్యూషన్ కంట్రోల్ బోర్డు) ద్వారా పరీక్షించింది. తాగునీటిగా సరఫరా చేస్తున్న ట్యాంకర్లలోని నీటి నమూనాలపై అధ్యయనం చేయించింది. సీసం, కాడ్మియం, నికెల్ లోహాల మోతాదులు అధికంగా ఉన్నాయని ఈ పరిశోధనల్లో వెల్లడైంది. ఇవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని పీసీబీ హెచ్చరించింది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఉండాల్సిన మోతాదులో కాకుండా.. రెండింతలు, మూడింతలు, 12 రెట్లు అధికంగా ఉండి ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయని పీసీబీ పరిశోధనల్లో వెల్లడైంది.

12 రెట్లు అధికంగా సీసం (Lead -Pb)..

అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఒక లీటరు నీటిలో 0.01 మిల్లీగ్రాముల సీసం (Lead -Pb) వరకూ ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాని సున్నం చెరువు చుట్టూ ఉన్న బోరు నీటిలో 0.073 – 0.122 ఉన్నట్టు పీసీబీ గుర్తించింది. అంటే అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఫర్వాలేదు అనుకునే స్థాయిలో 7 నుంచి 12 రెట్లు అధికంగా ఉన్నట్టు వెల్లడైంది. దీంతో పిల్లల మెదడు చురుకుతనంపై ప్రభావం చూపుతోంది. జ్ఞాపిక శక్తిని తగ్గిస్తుంది. రక్తహీనతకు కారణమవవ్వడమే కాకుండా.. బాల్యం, యవ్వన దశలోనే కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు, సంతానోత్పత్తిపైనా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు.

2 నుంచి 3 రెట్లు అధికంగా కాడ్మియం(Cadmium -Cd)…

కాడ్మియం 0.003 వరకూ ఫర్వాలేదు అని అంతర్జాతీయ ప్రమాణాలు చెబుతున్నాయి. అయితే సున్నం చెరువు పరిసరాల్లోని బోరు వాటర్లో 0.007 – 0.010 ఉన్నట్టు వెల్లడైంది. 2 – 3 రెట్లు అధికం ఉంది. అధిక మొత్తంలో ఉన్న కాడ్మియం మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది. మూత్రం ద్వారా ప్రొటీన్లు పోవడంతో ఎముకుల బలహీనతకు దారి తీస్తుంది. క్యాన్సర్ వ్యాధికి కారణమౌతుందని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ వెల్లడించింది.

రెండురెట్లు అధికంగా నికెల్ ( Nickel – Ni)…

అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఒక లీటరు నీటిలో 0.02 మిల్లీగ్రాముల మోతాదులో నికెల్ ఉంటే ఫర్వాలేదు. కాని సున్నం చెరువు చెంత ఉన్న బోర్లలో 0.038 – 0.046 అధికంగా ఉన్నట్టు వెల్లడైంది. అంటే 2 రెట్లు అధికంగా ఉన్నట్టు వెల్లడైంది. మనం తాగే నీటిలో నికెల్ ఎక్కువ ఉంటే.. చర్మ సంబంధిత వ్యాధులతో పాటు.. కాలేయం దెబ్బతింటోంది. తద్వారా మూత్రపిండాలు దెబ్బతింటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధిక ఒత్తిడికి గురై చిన్న వయసులోనే రక్తపోటుకు కూడా కారణమౌతుందని వైద్యులు చెబుతున్నారు.

మరగబెట్టినా వదలని కాలుష్యం..

సహజంగా నీటిని మరగబెట్టి తాగండి అంటారు.. కాలుష్య సాగరాల చెంత ఉన్న బోర్ల నుంచి వచ్చే నీటిని మరగబెట్టి వినియోగించినా ప్రయోజనం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇందులో శూక్ష్మక్రిములు నశించినా.. సీసం, కాడ్మియం, నికెల్ వంటి భార లోహాలు కరగకపోగా… మరింత దగ్గరగా మారి ప్రమాదకరంగా పరిణమిస్తాయని హెచ్చరిస్తున్నారు. సున్నం చెరువు చెంతనే కాకుండా.. నగరంలోని కాలుష్య సాగరాలు, మురుగు కాలువల చెంత ఉన్న నివాస ప్రాంతాల్లోని భూగర్భ జలాలంతలెక్కా ఇదే పరిస్థితి ఉందని పీసీబీ పరిశోధనల ద్వార వెల్లడైంది. సున్నం చెరువు చెంత బోరు నీటిని తాగునీటి అవసరాలకు అమ్ముతున్నవారిపై పోలీసు కేసులు కూడా హైడ్రా పెట్టించింది.

సున్నం చెరువుకు మొదటి ప్రాధాన్యం

ఇంతటి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నందునే హైడ్రా సున్నం చెరువు పునరుద్ధరణకు మొదటి ప్రాధాన్యతనిచ్చింది. నగరంలో చేపడుతున్న 6 చెరువుల (మాధాపూర్లోని సున్నం చెరువు, తమ్మిడికుంట, కూకట్పల్లి నల్లచెరువు, ఉప్పల్లోని నల్లచెరువు, అంబర్పేటలోని బతుకమ్మకుంట, పాతబస్తీలోని బమృక్ నుద్దౌలా చెరువు) పునరుద్ధరణలో సున్నం చెరువు ఉంది. శేరిలింగంపల్లి, కూకట్పల్లి మండలాల సరిహద్దులోని గుట్టల బేగంపేట, అల్లాపూర్ గ్రామాల మధ్య సున్నం చెరువు 32.60 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ చెరువును కాలుష్యం నుంచి కాపాడి.. మంచి నీరు నిలిచేలా దాదాపు రూ. 10కోట్లతో హైడ్రా అభివృద్ధి చేస్తోంది.

Leave a Reply