Weather | పగలు సురసుర.. రాత్రి గజగజ

Weather | పగలు సురసుర.. రాత్రి గజగజ
- పగటిపూట ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువ నమోదు
- రాత్రివేళ కొనసాగుతున్న చలి, పొగమంచు
Weather | వెబ్డెస్క్, ఆంధ్రప్రభ : నిన్నమొన్నటి వరకు చలి చంపేసింది. ఇప్పుడిప్పుడే చలి దుప్పటి నుంచి ప్రజలు బయటకు వస్తున్నారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలికి గజగజ వణికిపోయారు. ఇళ్ల నుంచి కాలు బయటకు పెట్టడానికి భయపడ్డారు. సంక్రాంతి పండగ తర్వాత వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. పగలు భానుడు బయటకు వస్తుంటే.. రాత్రివేళ చలి గజగజ వణికిస్తున్నాడు. ఇలా భిన్న వాతావరణంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ఆంధ్రప్రదేశ్లో రెండు రోజులుగా వాతావరణం మారింది. పగటిపూట ఎండలు మండిపోతుంటే, రాత్రిళ్లు చలిగాలులు వీస్తున్నాయి. రాయలసీమలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత కొనసాగుతుండగా.. కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్రలో పొగమంచు ప్రభావం కూడా కనిపిస్తోంది. పరిస్థితులు చూస్తుంటే.. ఈసారి ఎండల తీవ్రత ముందుగానే మొదలయ్యేలా కనిపిస్తోంది. మొత్తం మీద రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.

ఆంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రత మొదలైంది. రెండు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మధ్యాహ్నం భానుడు మండిపోతుండగా.. రాత్రి చలిగాలులు ఇబ్బంది పెడుతున్నాయి. పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. నందిగామలో 33.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే 3 రోజుల్లో రాయలసీమలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత కొనసాగింది. మంగళవారం రాష్ట్రంలోనే అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో 7.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి.
