ఎస్ఆర్బిసి కాలువలో విద్యార్థి గల్లంతు..

  • పోలీసుల గాలింపు చర్యలు…

నంద్యాల, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా పాములపాడు మండలం కృష్ణానగర్‌కు చెందిన వీరేష్‌ అనే ఇంటర్‌ విద్యార్థి గురువారం సాయంత్రం ప్రమాదవశాత్తు ఎస్సార్‌బీసీ కాలువలో పడి గల్లంతైన ఘటన కలకలం రేపింది.

పాములపాడు నుంచి మద్దూరు వెళ్లే ప్రధాన రహదారికి సమీపంలో ఉన్న ఎస్సార్‌బీసీ కాలువ వద్ద ఈ ప్రమాదం జరిగింది. కృష్ణానగర్ గ్రామానికి చెందిన వీరేష్‌ పాములపాడు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు.

సాయంత్రం కాలువ సమీపంలో ఉండగా, ప్రమాదవశాత్తు జారి నీటిలో పడిపోయినట్లు ప్రాథమిక సమాచారం. క్షణాల్లోనే నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు.

వార్త అందుకున్న పాములపాడు ఎస్‌ఐ సురేశ్‌బాబు సంఘటన స్థలానికి చేరుకొని, గాలింపు చర్యలు ప్రారంభించారు. నాటుపడవల సహాయంతో విద్యార్థి కోసం విస్తృతంగా అన్వేషణ కొనసాగుతోంది.

అయితే, విద్యార్థి అనుకోకుండా జారిపడ్డాడా? లేక మరేదైనా కారణం ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Leave a Reply