ముంబై: దేశీయ మార్కెట్ సూచీలు శుక్రవారం భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ.. దేశీయంగా బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు సూచీలను పడేశాయి. దీనికి తోడు పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో సెన్సెక్స్ ఏకంగా 950పాయింట్లకు పైగా పతనమవ్వగా.. నిఫ్టీ 24వేల మార్కును కోల్పోయింది. బీఎస్ఈలో మదుపర్ల సంపదగా భావించే నమోదిత కంపెనీల మార్కెట్ విలువలో రూ.7.5 లక్షల కోట్ల మేర ఆవిరైంది.
శుక్రవారం నాటి ట్రేడింగ్ ను సూచీలు సానుకూలంగానే ప్రారంభించినప్పటికీ.. కాసేపటికే అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఉదయం 11 గంటల సమయంలో సెన్సెక్స్ 952.7 పాయింట్లు కుంగి 78,850.71 వద్ద ట్రేడ్ అవుతోంది. అటు నిఫ్టీ 324.7 పాయింట్లు దిగజారి 23,922.05 వద్ద కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ 1.56శాతం మేర నష్టాల్లో ఉంది. ప్రధాన బ్యాంకులైన ఎస్బీఐ షేర్లు 2.71శాతం, హెచీఎఫ్సీ బ్యాంక్ షేర్లు 0.62 శాతం, ఐసీఐసీఐ షేర్లు 0.42 శాతం మేర కుంగాయి. పహల్గాం దాడితో భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను మదుపర్లు జాగ్రత్తగా గమనిస్తున్నారు.
పహల్గాం దాడితో భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను మదుపర్లు జాగ్రత్తగా గమనిస్తున్నారు. యుద్ధ పరిస్థితుల ఆందోళనలతో లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. అటు అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులు కూడా మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు, ఆసియా పసిఫిక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ఉన్నాయి. జపాన్ నిక్కీ 0.91 శాతం, దక్షిణ కొరియా కోస్పి 1.03శాతం, హాంకాంగ్ హాంగ్సెంగ్ సూచీ 0.75 శాతం లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. వాల్ట్ మార్కెట్లు వరుసగా మూడో రోజు రాణించాయి.