సింహవాహనంపై శ్రీ మలయప్ప విహారం
(తిరుమల, ఆంధ్రప్రభ ప్రతినిధి) : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో (Srivari Salakatla Brahmotsavams) మూడో రోజు శుక్రవారం ఉదయం శ్రీ మలయప్పస్వామి సింహ వాహనంపై యోగ నరసింహుడి అలంకారం (Decoration of Yoga Narasimha) లో దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్త జన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామి వారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామి వాహనసేవ ఉల్లాసంగా సాగింది.
సింహ వాహనం – ధైర్యసిద్ధి…
శ్రీవారు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహనాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయస్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు.
వాహన సేవలో తిరుమల పెద్దజీయర్స్వామి, చిన్నజీయర్స్వామి, టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్, పలువురు బోర్డు సభ్యులు, సీవీఎస్వో మురళి కృష్ణ పాల్గొన్నారు.

