ఉమ్మడి ఆదిలాబాద్, ఆంధ్రప్రభ : టెన్త్ స్పాట్ వాల్యుయేషన్ ఒక చోట నియమిస్తే.. మరో చోట విధులు నిర్వహిస్తున్న ఓ మహిళ ఉపాధ్యాయులకు విద్యాశాఖ అధికారులు షోకాజ్ నోటీసు ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ పలుకుబడితో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో టెన్త్ పేపర్ల వాల్యుయేషన్ చేయడం వివాదాస్పదంగా మారింది. మంచిర్యాలలో టెన్త్ మ్యాథ్స్ పేపర్లు దిద్దాలని ఉత్తర్వులు జారీ చేశామని మంచిర్యాల డీఈవో యాదయ్య తెలిపారు. అయితే ఆమె మంచిర్యాలలో కాకుండా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పేపర్లు దిద్దినట్టు ఆలస్యంగా తెలిసింది. ఈ మేరకు నిబంధనలు ఉల్లంఘించిన సవితకు క్రమశిక్షణ చర్యల కింద షోకాస్ నోటీసు జారీ చేశామని, సమాధానం బట్టి శాఖపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
స్పాట్ మంచిర్యాల.. మూల్యంకనం ఆదిలాబాద్లో…
ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం ఇస్గావ్ నెంబర్ -3 పాఠశాలలో పి.సవిత స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ టీచర్ గా పనిచేస్తున్నారు. పదో తరగతి పరీక్షల మూల్యాంకనం నిమిత్తం మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించాలని ఆ పాఠశాల సిబ్బందికి డీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే డీఈఓ ఆదేశాలు పక్కనపెట్టి సవిత తన సొంత ఊరు అయిన ఆదిలాబాద్ సెంట్ జోసెఫ్ కాన్వెంట్ హై స్కూల్ లో ప్రతిరోజు 40 పేపర్ల చొప్పున మూల్యాంకనం చేశారు. స్పాట్ వాల్యుయేషన్ నిబంధనలు తుంగలో తొక్కి ఇలా టీచర్లు ఇష్టారాజ్యంగా విధులు నిర్వహించడం విద్యార్థుల భవిష్యత్తుకే ప్రమాదంగా ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. ఈ విషయమై ఆదిలాబాద్ డీఈవో శ్రీనివాస్ రెడ్డిని ఆంధ్రప్రభ వివరణ కోరగా తమకు తెలియకుండానే ఆదిలాబాద్ లో స్పాట్ వాల్యుయేషన్ చేస్తుందని, ఆమెను తిరిగి కాగజ్ నగర్ పంపినట్టు వివరించారు.