ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు 2027 వన్డే వరల్డ్కప్ (2027 ODI World Cup) టోర్నమెంట్కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం వచ్చింది. మళ్లీ దాదాపు 24 ఏళ్ల తర్వాత సఫారీ జట్టు టోర్నమెంట్ ఆతిథ్య హక్కులు అందుకుంది. అంతకుముందు ఈ మెగాటోర్నీకి సౌతాఫ్రికా (South Africa) చివరిసారి 2003లో ఆతిథ్యం ఇచ్చింది. ఆ తర్వాత జరిగిన 2007, 2011, 2015, 2019, 2023 టోర్నీల్లో సౌతాఫ్రికాకు అవకాశం దక్కలేదు. దీంతో టోర్నమెంట్ను ఘనంగా నిర్వహించేందుకు సఫారీ క్రికెట్ బోర్డు ప్లాన్స్ చేస్తుంది. కాగా, 2027 వరల్డ్కప్ అక్టోబర్, నవంబర్ నెలల్లో జరగనుంది.
మూడు దేశాలు సంయుక్తంగా…
2027 వన్డే వరల్డ్కప్ టోర్నమెంట్కు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు (South Africa Cricket Board) సన్నాహాలు ప్రారంభించింది. రాబోయే ఈ టోర్నీలో సౌతాఫ్రికాతోపాటు జింబాబ్వే, నమీబియా (Zimbabwe, Namibia) సంయుక్తంగా ఆథిత్యం ఇవ్వనున్నాయి. ఈ టోర్నమెంట్లో లీగ్ మ్యాచ్లు, సెమీఫైనల్, ఫైనల్ (Semifinal, Final) సహా 54 మ్యాచ్లు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో మెగా ఈవెంట్ను దృష్టిలో ఉంచుకుని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు తమ దేశంలో మ్యాచ్లు జరిగే స్టేడియాలను ఫైనలైజ్ చేసింది.
సౌతాఫ్రికాలో అత్యధిక మ్యాచులు
టోర్నీలో మొత్తం 54 మ్యాచ్లు ఉండగా, అందులో అత్యధికంగా 44 మ్యాచ్లకు సౌతాఫ్రికానే ఆతిథ్యం ఇవ్వనుంది. మిగిలిన 10 మ్యాచ్లు జింబాబ్వే, నమీబియాలో జరుగుతాయి. 44 మ్యాచ్లను నిర్వహించడానికి సౌతాఫ్రికా దేశంలో 8 స్టేడియాలను ఎంపిక చేసినట్లు సౌతాఫ్రికా స్థానిక టోర్నమెంట్ నిర్వాహక కమిటీ బోర్డు (LOCB) ఛైర్మన్, మాజీ కేబినెట్ మంత్రి ట్రెవర్ మాన్యుయేల్ ప్రకటన చేశారు. ఇందులో జొహెన్నస్బర్గ్లోని వాండరర్స్ స్టేడియం, కేప్టౌన్లోని న్యూ లాండ్స్ క్రికెట్ గ్రౌండ్స్, డర్బన్ కింగ్స్ మీడ్ క్రికెట్ గ్రౌండ్, ప్రిటోరియా సెంచూరియన్ పార్క్, బ్లూమ్ ఫోంటైన్ మాంగాంగ్ ఓవల్, గ్కెబెరాలోని సెయింట్ జార్జ్ పార్క్, ఈస్ట్ లండన్లోని బఫెలో పార్క్, పార్ల్ బోలాండ్ పార్క్ ఉన్నాయి. ఈ ఎనిమిది నగరాల్లోని స్టేడియాల్లో మొత్తం 44 మ్యాచ్లు జరగనున్నాయి. నమీబియాలోని విండ్హోక్లోని యునైటెడ్ గ్రౌండ్, నమీబియా క్రికెట్ గ్రౌండ్తోపాటు, జింబాబ్వే బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, హరారేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ స్టేడియాల్లో మిగిలిన 10 మ్యాచ్లు జరిగే అవకాశం ఉంది.
ఈసారి మారిన టోర్నీ ఫార్మాట్
2023 వరల్డ్కప్ (2023 World Cup)లో గ్రూపులు లేకుండానే టాప్ 4 జట్లు సెమీస్కు వెళ్లాయి. కానీ ఈసారి టోర్నీ ఫార్మాట్ మారనుంది. ఇందులో 14 జట్లు పాల్గొననున్నాయి. సౌతాఫ్రికా, నమీబియా, జింబాబ్వే వద్ద ఆతిథ్య హక్కులు ఉన్నాయి. కాబట్టి ఈ మూడు జట్లు నేరుగా క్వాలిఫై అయిపోతాయి. మొత్తం 14జట్లను రెండు గ్రూపులుగా విభజించి మ్యాచ్లు నిర్వహించనున్నారు. ఇందులో ప్రతి గ్రూప్ నుంచి టాప్- 3 జట్లు సూపర్ సిక్స్(Super Six)లో ఆడడానికి అర్హత సాధిస్తాయి. ఆ తర్వాత సూపర్ 6లోని టాప్ 4 జట్లు సెమీఫైనల్స్ ఆడతాయి. ఇందులో నెగ్గిన జట్ల మధ్య టైటిల్ పోరు ఉంటుంది. ఈ ఫార్మాట్లో గతంలో రెండుసార్లు (1999, 2003) వన్డే ప్రపంచ కప్ జరిగింది.