సింగరేణి కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందించడం కోసం ఖర్చుకు వెనకాడకుండా అన్ని రకాల వైద్య పరీక్షల యంత్రాలు, ఔషధాలు సమకూర్చటానికి యాజమాన్యం సంసిద్ధంగా ఉందని ఇప్పటికే పలుమార్లు చెప్పానని, అయినప్పటికీ కొన్ని ఏరియా ఆసుపత్రుల నుండి ప్రతిపాదనలు పంపడంలో ఎందుకు శ్రద్ధ వహించడం లేదు అని సింగరేణి వైద్య శాఖ పై ఛైర్మన్, ఎండీ ఎన్.బలరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియా ఆసుపత్రుల ప్రధాన వైద్యాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎండీ బలరామ్ మాట్లాడుతూ… ఏరియా ఆసుపత్రుల యాజమాన్యాలు తక్షణమే వారికి కావలసి ఉన్న కనీస వైద్య పరికరాలు, అవసరమైన మందుల ప్రతిపాదనలు పంపించాలని, తన తదుపరి తనిఖీలలో ఏ ఒక్క పరికరం లేదు అనే మాట రాకూడదని హెచ్చరించారు.
వార్షిక ప్రణాళిక పేర్లతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు ఏ ఏ పరికరాలు కావాలన్నది నిర్ధారించుకొని ప్రతిపాదనలు పంపించాలన్నారు. ఇప్పటికే ఏరియా ఆసుపత్రులకు వైద్యుల్ని కేటాయించామని, ఇంకా అవసరమైన వైద్యుల్ని, టెక్నీషియన్ లను సమకూర్చేందుకు యాజమాన్యం సంసిద్ధంగా ఉందన్నారు.
చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్న రోగులకు ఏరియా ఆసుపత్రుల్లో వైద్యం అందించే అవకాశం ఉన్నప్పటికీ అలా చేయకుండా వెంటనే హైదరాబాద్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారని, తద్వారా గత మూడేళ్లలో 30 కోట్ల రూపాయలు ఉన్న రిఫరల్ బిల్లులు ఇప్పుడు రూ100 కోట్లకు చేరాయి అన్నారు. కంపెనీ డాక్టర్లు తమ సమర్థతను, నైపుణ్యాన్ని చూపించకుండా ప్రతి చిన్న కేసును రిఫర్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది అన్నారు.
డాక్టర్లు అంకితభావంతో వైద్య సేవలు అందించాలని, విధి నిర్వహణలో పూర్తి క్రమశిక్షణ పాటించాలని ఆయన కోరారు. సింగరేణి ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణ కోసం యాజమాన్యం ఏటా 400 కోట్ల రూపాయలను వెచ్చిస్తోంది. ఆసుపత్రులను ఆధునికీకరిస్తోందని తెలిపారు.
హైదరాబాద్ లోనూ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో సింగరేణి లో పనిచేస్తున్న వైద్యులంతా పూర్తి అంకిత భావంతో పనిచేయాలని, కార్మికుల నమ్మకాన్ని గెలచుకోవాలని సూచించారు.
గతంలో వైద్య సేవలకు నిధుల మంజూరులో అనేక ఆటంకాలు ఉండేవని, కానీ ఇప్పుడు ఎటువంటి కోతలు, తగ్గింపులు లేకుండా నిధులు మంజూరు చేయటానికి యాజమాన్యం సిద్ధంగా ఉందని, ఈ సానుకూల దృక్పథాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ఆసుపత్రుల యాజమాన్యాలపై ఉందని ఛైర్మన్ పేర్కొన్నారు. కాగా కోవిడ్ వ్యాప్తి జరిగినట్లయితే దానిని ఎదుర్కొనేందుకు అన్ని ఏరియా ఆసుపత్రుల్లో తగిన విధంగా సంసిద్ధమై ఉండాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు డి.సత్యనారాయణ రావు(ఈ అండ్ ఎం), ఎల్వీ సూర్యనారాయణ రావు (ఆపరేషన్స్), కె.వేంకటేశ్వర్లు (పి అండ్ పి, పా), ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ ఎస్.డి.ఎం.సుభానీ, జీఎం(మార్కెటింగ్) ఎన్.వి.రాజశేఖరరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్, అన్ని ఏరియా ఆసుపత్రుల ముఖ్య అధికారులు, తదితరులు పాల్గొన్నారు.