సింగరేణి సంస్థ చేపట్టిన వ్యాపార విస్తరణ ప్రాజెక్టుల్లో పనులు మందకొడిగా సాగితే ఉపేక్షించేది లేదని సీఎండీ ఎన్.బలరామ్ హెచ్చరించారు. సోలార్, పవన, జియో థర్మల్ విద్యుత్, బ్యాటరీ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్, మినిరల్స్, మిథనాల్ ఉత్పత్తి వంటి 28 రకాల విస్తరణ ప్రాజెక్టులపై ఆయన విభాగాధిపతులతో సమీక్ష నిర్వహించారు.
వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ, కొన్ని ప్రాజెక్టులు ప్రారంభదశలో ఉండగా, మరికొన్నింటిపై ఒప్పందాలు కుదిరాయని, కానీ పనుల పురోగతి ఆశించినంతగా లేదని అసహనం వ్యక్తం చేశారు. 10 రోజులలోపే ప్రతీ ప్రాజెక్టులో ప్రగతి కనిపించాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు.
ఇకపై ప్రతీ వారం విస్తరణ ప్రాజెక్టులపై ప్రత్యేక సమీక్ష ఉంటుందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా ఉన్నందున, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
సమావేశంలో డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, 20 విభాగాల జీఎంలు పాల్గొన్నారు. రూఫ్టాప్ సోలార్, కోల్ వాషరీస్, హైడ్రాలిక్ కన్వేయర్లు వంటి అంశాలపై కూడా చర్చించారు.